న్యూఢిల్లీ: కారు యాక్సిడెంట్లో తన కుడి కాలు తెగిపోతుందేమోనని భయపడినట్లు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వెల్లడించాడు. ఘోరమైన ప్రమాదం నుంచి కోలుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ‘నరాలు దెబ్బతింటే కచ్చితంగా కాలును కోల్పోయేవాడ్ని. ఈ విషయం తెలిసి అప్పట్లో చాలా భయపడ్డా. యాక్సిడెంట్లో స్థానభ్రంశం చెందిన కాలును తిరిగి యధా స్థానంలోకి తీసుకొచ్చేందుకు ట్రై చేశా.
కానీ విపరీతమైన నొప్పి. నా లైఫ్లో అలాంటి బాధను తొలిసారి అనుభవించా. ప్రమాదం తీవ్రమైందని అర్థమైంది. గాయం నుంచి కోలుకోవడానికి ప్రతీ రోజు ఒకే రకమైన పని చేయాల్సి వచ్చేది. అది చాలా బోరింగ్గా అనిపించింది. కోలుకోవడానికి 16 నుంచి 18 నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పారు’ అని పంత్ పేర్కొన్నాడు.