
దుబాయ్ : సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో ఓటమి తర్వాత ఇండియా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సమయంలో ఎంఎస్ ధోనీ ఒక్కడే తనకు మెసేజ్ పంపించాడని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. తన ఫోన్ నంబర్ చాలా మంది దగ్గర ఉన్నా ఎవ్వరూ పలుకరించలేదన్నాడు. టీవీల్లో సూచనలు చేసిన వాళ్లెవ్వరూ తనకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేయలేదని చెప్పాడు. పాక్తో మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన విరాట్.. తన తొలి కెప్టెన్ ధోనీతో అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నాడు.
‘ఒక వ్యక్తితో అనుబంధం, గౌరవం ఉంటే అది నిజాయితీతో కూడినది అయితే ఇలానే (ధోనీతో) ఉంటుంది. మా ఇద్దరి విషయంలో ఇరువైపులా నమ్మకం ఉంది. ఇద్దరం కలిసి ఆడాం. ఒకరి విషయంలో మరొకరం ఎప్పుడూ అభద్రత భావంతో లేము. నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నా.. సలహా ఇవ్వాలన్నా నేరుగా మాట్లాడి చెబుతా. అంతే తప్ప ప్రపంచం మొత్తం చూసేలా (టీవీల్లో) చెబితే దానికి విలువ ఉండదు’ అని కోహ్లీ చెప్పాడు. అయితే విరాట్ కెప్టెన్గా దిగిపోయిన తర్వాత తోటి ఆటగాళ్ల నుంచి బీసీసీఐ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ అతనికి అండగా నిలిచారని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.