సీఎం జగన్ తో సోమేష్ కుమార్ భేటీ..!

సీఎం జగన్ తో  సోమేష్ కుమార్ భేటీ..!

ప్రభుత్వ అధికారిగా ఏపీ ప్రభుత్వం తనకి ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అన్నారు. డీపీవోటీ అదేశాల మేరకే తాను ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేస్తానని చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఆయన ముందుగా ఏపీ సీఎస్ ను కలవనున్నారు. అనంతరం సీఎం జగన్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అదేశాల ప్రకారమే తాను నడుచుకుంటానని సోమేష్ కుమార్ స్పష్టం చేయనున్నారు. 

సోమేశ్ కుమార్కు ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణకు సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసిన ధర్మాసనం.. సర్టిఫైడ్ కాపీ అందిన వెంటనే ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ను కేంద్రం  ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులపై ఆయన క్యాట్ను ఆశ్రయించడంతో 2016లో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేలా హైదరాబాద్ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.  క్యాట్ ఉత్తర్వులతో అప్పటి నుంచి సోమేశ్ తెలంగాణలోనే కొనసాగుతూ వచ్చారు.