దుబాయ్: యావత్ క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్కప్కు సమయం ఆసన్నమైంది. ఆదివారం నుంచి అరబ్ గడ్డపై ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ మెగా సమరం జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. లాస్ట్ టైమ్ ఇండియా ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో వెస్టిండీస్ టైటిల్ గెలిచింది. కోల్కతాలో ఇంగ్లండ్తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో లాస్ట్ ఓవర్లో బ్రాత్వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టడం ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేదు. సరిగ్గా అలాంటి పోరాటాలకే ఇప్పుడు ఆరబ్ గడ్డ వేదిక కాబోతున్నది. షెడ్యూల్ ప్రకారం ఇండియాలో ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా యూఏఈకి తరలించారు. ఈ నెల 17 నుంచి నవంబర్ 14 వరకు అబుదాబి, దుబాయ్, షార్జా, ఒమన్లో మ్యాచ్లు జరగనున్నాయి.
మూడు దశల్లో..
మొత్తం 16 జట్లతో ఈసారి మెగా టోర్నీ మూడు దశల్లో జరగనుంది. నేటి నుంచి రౌండ్–1 మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఇందులో రెండు గ్రూప్లు ఉంటాయి. ప్రతి గ్రూప్లో నాలుగు టీమ్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీపడతాయి. ఒక్కో గ్రూప్లో టాప్–2లో నిలిచిన జట్లు సూపర్–12కు వెళ్తాయి. గ్రూప్–ఎలో ఐర్లాండ్, నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్, గ్రూప్–బిలో బంగ్లాదేశ్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, ఒమన్ ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ మినహా.. మిగతా టీమ్లన్నీ 2019 క్వాలిఫయర్స్ నుంచి వచ్చాయి. ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఈ రౌండ్ మ్యాచ్లు ఫినిష్ అవుతాయి.
సూపర్-12
ఇందులోనూ రెండు గ్రూప్లు–1, 2 ఉన్నాయి. ఒక్కో గ్రూప్లో ఆరు టీమ్స్ రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీపడతాయి. గ్రూప్–1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఎ–1, బి–2 (రౌండ్–1 నుంచి) ఉండగా, గ్రూప్–2లో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఎ–2, బి–1 (రౌండ్–1 నుంచి) పోటీపడనున్నాయి. ఐసీసీ కటాఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియాతో పాటు టాప్–7 టీమ్స్ ఈ స్టేజ్కు డైరెక్ట్గా క్వాలిఫై కాగా, రౌండ్–1 నుంచి మిగతా నాలుగు టీమ్స్ వచ్చాయి. ఈ నెల 23 నుంచి నవంబర్ 8 వరకు ఈ స్టేజ్ మ్యాచ్లు కంప్లీట్ అవుతాయి. ప్రతి గ్రూప్లో టాప్–2 టీమ్స్ నాకౌట్ (సెమీస్)కు చేరుతాయి. 2 సెమీస్ల్లో గెలిచిన జట్లు ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. నవంబర్ 10, 11న సెమీస్, 14న ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి.
పాయింట్స్ ఇలా...
మ్యాచ్ గెలిస్తే 2 పాయింట్లు, టై/ నో రిజల్ట్ / రద్దుకు ఒక్క పాయింట్ కేటాయిస్తారు. ఓడితే ఎలాంటి పాయింట్లు ఉండవు. సెమీస్, ఫైనల్కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. మిగతా మ్యాచ్లకు లేవు. నాకౌట్ స్టేజ్లో మ్యాచ్ రిజల్ట్ కోసం కనీసం 5 ఓవర్లైనా ఆడిస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే రిజర్వ్ డే రోజు అదే మ్యాచ్ను ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తారు.