నిర్దోషి అని తేలితే తిరిగి రావొచ్చు

నిర్దోషి అని తేలితే తిరిగి రావొచ్చు

ఎవరు తప్పు చేసినా టీఎంసీ విడిచిపెట్టదని ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. మనీలాండరింగ్​ కేసులో మంత్రి పార్థా ఛటర్జీని, అర్పితా ముఖర్జీని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో... సీఎం మమత బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గం నుంచి పార్థాను తప్పించారు. ఈ సందర్భంగా.. అభిషేక్ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి నుంచి అతడిని తొలగించడం జరిగిందని.. ఈ అంశంపై విచారణ సాగుతోందన్నారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ఉపాధ్యక్షులు, మరో మూడు పదవుల నుంచి పార్థను తొలగించడం జరిగిందన్నారు. నిర్దోషి అని తేలితే తిరిగి రావొచ్చన్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ కేసు కలకలం రేపుతోంది. మంత్రి పార్థా ఛటర్జీపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు, సినీ నటి అర్పిత ముఖర్జీలను జులై 23న అరెస్టు చేశారు. ఆగస్టు 3 వరకు వీరు రిమాండ్లో ఉండనున్నారు. ఈడీ అధికారులు తాజాగా జరిపిన సోదాల్లో రూ. 21 కోట్లు దొరికాయి. అంతకుముందు సోదాలు జరిపితే.. రూ. 29 కోట్లు పట్టుబడ్డాయి. కిలోల కొద్దీ బంగారం, విలువైన డాక్యుమెంట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు రూ. 50 కోట్లకు పైగా నగదును ఈడీ సీజ్ చేసినట్లు సమాచారం.