- రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన పీఎఫ్సీ, ఆర్ఈసీ
- ఒప్పందం ప్రకారం లోన్లు ఇవ్వాలని కోరిన సర్కారు
- ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు
- నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులపైనా ప్రభావం
హైదరాబాద్, వెలుగు: రిజర్వ్ బ్యాంకు ఓకే చెప్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి లోన్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు తేల్చిచెప్పాయి. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యధిక లోన్లు ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) ఇప్పుడు ఆర్బీఐ క్లియరెన్స్ ఇస్తే తప్ప లోన్లు ఇవ్వలేమని చేతులెత్తేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రుణాలు తీసుకుందని, లోన్లు ఇచ్చేందుకు ఆర్బీఐ నిరాకరిస్తోందన్న విషయాన్ని ఈ సందర్భంగా పీఎఫ్సీ, ఆర్ఈసీ ప్రస్తావించాయి. ఆర్థిక సంస్థల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రిప్లయ్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఒప్పందం ప్రకారం లోన్లు ఇవ్వాలని కోరింది. తమ ప్రాజెక్టులన్నీ నిర్మాణం పూర్తి చేసుకొని కమిషన్ అయ్యే దశలో ఉన్నాయని, ఈ స్టేజీలో లోన్లు ఇవ్వకుంటే ప్రాజెక్టులు నిర్మించి ఉపయోగం ఉండబోదని పేర్కొంది. అయినా ఫైనాన్స్ సంస్థలు ఆర్బీఐ ఓకే చెప్తేనే లోన్లు ఇస్తామని మరోసారి తేల్చిచెప్పాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం తల పట్టుకుంటోంది.
కార్పొరేషన్ల ద్వారా రుణాలు
నీటి ప్రాజెక్టుల కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్(కేఐపీసీఎల్), తెలంగాణ స్టేట్ వాటర్ రీసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీఎల్)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేఐపీసీఎల్ ద్వారా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు రుణాలు సమకూర్చుతున్నారు. వాటర్ రీసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వరద కాలువ, దేవాదుల ఎత్తిపోతల, సమ్మక్క బ్యారేజీ, సీతారామ లిఫ్ట్, సీతమ్మసాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్టులకు లోన్లు సర్దుబాటు చేస్తున్నారు. సింగూరు ఆధారంగా చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు లోన్లు సమకూర్చేందుకు కొత్తగా మంజీరా ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో తలపెట్టిన లిఫ్టులకు కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి లోన్లు సమకూర్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే రాష్ట్ర సర్కారు నేరుగా తీసుకున్న అప్పులతోపాటు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న లోన్లు ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించాయని ఆర్బీఐ కొరడా ఝళిపించింది. దీంతో రాష్ట్రం తీసుకోవాలని ప్రయత్నిస్తున్న లోన్లకు బ్రేకులు పడ్డాయి.
లోన్లు రాక బిల్లులు పెండింగ్
కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి రూ.1.31 లక్షల కోట్ల లోన్ తీసుకునేందుకు అవకాశం ఉండగా.. ప్రభుత్వం రూ.96,064 కోట్ల లోన్ తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాబార్డు రూ.57,216 కోట్లు రిలీజ్ చేశాయి. పీఎఫ్సీ రూ.26,351 కోట్లు, ఆర్ఈసీ రూ.30,536 కోట్లు లోన్ ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకోగా, రెండు కార్పొరేషన్ల నుంచి ఇంకా రూ.20 వేల కోట్లకుపైగా లోన్ రావాల్సి ఉంది. వివిధ బ్యాంకుల కన్సార్షియంతోపాటు నాబార్డు నుంచి రావాల్సిన మరో రూ.10 వేల కోట్ల లోన్లు కూడా రిలీజ్ చేయడం లేదు. దీంతో కాళేశ్వరం, పాలమూరు-–-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో పూర్తి చేసిన రూ.5 వేల కోట్ల విలువైన పనులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవి ఇప్తే తప్ప మిగతా పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. వాటర్ రీసోర్సెస్ కార్పొరేషన్ కు పీఎఫ్ సీ, ఆర్ఈసీ నుంచి రూ.10 వేల కోట్లకు పైగా లోన్ రావాల్సి ఉంది. మొత్తంగా రెండు కార్పొరేషన్లకు వీటి నుంచి రూ.30 వేల కోట్లకు పైగా లోన్లు ఆగిపోయాయి. బ్యాంకులు, నాబార్డు నుంచి రావాల్సిన ఇంకో రూ.15 వేల కోట్ల లోన్లకు బ్రేక్ పడింది.
రూ.55 వేల కోట్ల వరకు ఆగిపోయినయ్
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ నెల్లికల్ సహా 15 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. వీటికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. రూ.3,599.92 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మాత్రమే ఇచ్చారు. ఈ ఎత్తిపోతలకు కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకొని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సింగూరు ప్రాజెక్టు ఆధారంగా చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ స్కీంల టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేం దుకు సిద్ధంగా ఉన్నారు. వీటికి రూ.4,500 కోట్ల వరకు నిధులు సమకూర్చడానికి కొత్తగా మంజీరా ఇరిగేషన్ కార్పొరేషన్ నెలకొల్పినా దీనికి లోన్లు వచ్చే పరిస్థితి లేదు. రెండో విడతలో 580 చెక్ డ్యాంలకు నాబార్డు నుంచి లోన్ తీసుకోవాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ లోన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. మొత్తంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు రావాల్సిన రూ.55 వేల కోట్ల లోన్లు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఆయా ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోతాయేమోనని ఇరిగేషన్ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.