కమలంకు ఓటేస్తే..ఈటలకు వందేళ్ల ఆయుష్షు పోసినట్లు

కమలంకు ఓటేస్తే..ఈటలకు వందేళ్ల ఆయుష్షు పోసినట్లు
  • మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ 

కరీంనగర్: కమలం పువ్వుకు గుర్తుకు ఓటెస్తే .. ఈటల రాజేందర్ కు వందేళ్ల  ఆయుష్షు పోసినట్లు అవుతుందని బీజేపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామం వద్ద మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలసి ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఈటల రాజేందర్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి.. ఓడిపోతామనే భయంతో కేసీఆర్ సర్పంచులను, ఎంపీపీలను కోట్లిచ్చి కొనుగోలు చేస్తున్నాడన్నారు. హుజురాబాద్ ప్రజలు కొంటే అమ్ముడు పోయేవాళ్లు కాదని, వాళ్లను కొనాలంటే కేసీఆర్, మెఘా కృష్ణారెడ్డి, రామేశ్వర్ రావులు సరిపోరన్నారు. ‘‘మీ గిమ్మిక్కులు ఇక్కడ పనిచేయవు.. కౌశిక్ రెడ్డిని కేటీఆర్, కేసీఆర్ జీరో చేసేశారు.. ఆయనను ఎక్కడికో తీసుకోపోతాడట. నాకు అట్లనే చెప్పిండు.. నన్ను బిడ్డా.. అని గొంతు పిసికిండు.. కుడి భుజమని, తమ్ముడని చెప్పిన ఈటలను పక్కన పెట్టి.. ఎర్రబెల్లిని పక్కన పెట్టుకుండు..’’ అని బొడిగె శోభ విమర్శించారు.  ‘‘మేం ఫక్తూ రాజకీయమే చేస్తామని నిన్న కేసీఆర్ చెప్పాడు.. ఐదు గ్రామాలకు ఓ కలెక్టర్ ను నియమించి పది లక్షలు ఇస్తాడట.. ఈ లోపు పుణ్యకాలం పూర్తవుతుంది.. ఎన్నికలయ్యాక... టైం సరిపోలేదని డబ్బులు ఎగ్గొడతాడు.. పది లక్షలు తీసుకున్న దళితులు ఇండ్ల మీద గులాబీ జెండా పెట్టుకోవాల్నట.. గతంలో ఇలాంటి హామీలెన్నో ఇచ్చి మాట తప్పిన చరిత్ర కేసీఆర్ ది..’’ అని బొడిగె శోభ మండిపడ్డారు.