ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాన్పూర్లో ఇంజినీరింగ్ చదివిన ఓ వ్యక్తి రోడ్డు మీద బిచ్చమడుకుంటున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో వెలుగులోకి వచ్చింది. సురేంద్ర వశిష్ట్ అనే 90 ఏళ్ల వ్యక్తి దారుణమైన స్థితిలో ఉండి రోడ్డు పక్కన బిచ్చమడుకుంటున్నాడు. సురేంద్రను ఆశ్రయం స్వర్గ్ సదన్కు చెందిన ఒక ప్రతినిధి చూసి.. అతనితో మాట్లాడాడు. మాటల్లో సురేంద్ర ఇంగ్లీష్ మాట్లాడటం చూసి సదన్ ప్రతినిధి కంగుతిన్నాడు. వెంటనే అతని గురించి పూర్తి వివరాలు అడగగా.. తాను 1969లో ఐఐటి-కాన్పూర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశానని తెలిపాడు. అంతేకాకుండా 1972లో లక్నో నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశానని తెలిపాడు. తన తండ్రి 1990లో మూసివేయబడిన జేసీ మిల్లులో పనిచేసేవాడని సురేంద్ర తెలిపాడు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత సదన్ ప్రతినిధి ఆశ్చర్యపోయాడు. ఒక ఇంజనీర్ ఇలా రోడ్డుపై అడుక్కోవడమేంటని అనుకున్నాడు. వెంటనే సురేంద్రను తమ ఆశ్రమానికి తీసుకెళ్లాడు.
‘మేం సురేంద్రను బస్టాండ్ దగ్గర చాలా దారుణమైన స్థితిలో చూశాం. మేం అతనితో మాట్లాడినప్పుడు సురేంద్ర మాతో ఇంగ్లీషులో మాట్లాడాడు. దాంతో ఆశ్చర్యపోయిన మేం.. వెంటనే ఆయన పూర్తి వివరాలు తీసుకొని మా ఆశ్రమానికి తీసుకువచ్చాం. ఆయన బంధువులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని ASS యొక్క ప్రతినిధి వికాష్ గోస్వాని తెలిపాడు.
కొన్ని రోజులముందు మధ్యప్రదేశ్లో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా బిచ్చమడుకుంటూ కనిపించాడు. అతను మానసిక సమస్యలతో కొన్ని సంవత్సరాల క్రితం తప్పిపోయాడు. అప్పటి నుంచి ఆయన రోడ్డు పక్కన బిచ్చమడుకుంటున్నాడు. ఆయన గుర్తుపట్టిన తోటి అధికారులు ఇదే ఆశ్రమానికి తరలించారు. ఆ పోలీసు ఆఫీసర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
For More News..