
- కొరవడిన పోలీసుల నిఘా
- పెరుగుతున్న క్రైమ్ రేట్
- నామ్కే వాస్తేగా సీసీ కెమెరాలు
- పోలీసులకు సవాల్ విసురుతున్న నేరగాళ్లు
మహబూబ్నగర్/ జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల టౌన్లో రోజురోజుకు యాంటీ సోషల్యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. రాజధానికి దగ్గరగా ఉండడంతో టౌన్విస్తరిస్తోంది. దాంతోపాటే క్రైమ్రేట్కూడా పెరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో షాద్నగర్ తర్వాత జడ్చర్లలో అధికంగా పరిశ్రమలు ఉండటంతో ఉత్తర్ప్రదేశ్, బిహార్, కర్ణాటక, ఏపీ, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వేలాది మంది వచ్చి నివాసముంటున్నారు. ఈ క్రమంలో సిటీలో జనాభా పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా నిఘా పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. క్రైమ్రేట్, అక్రమ, నకిలీ వ్యాపారాలకు జడ్చర్ల కేరాఫ్అడ్రస్గా మారింది.
ఫిర్యాదు చేస్తేనే చర్యలు
జడ్చర్ల టౌన్లో కల్తీ, అక్రమ వ్యాపారులు విజృంభిస్తున్నారు. నిత్యావసర వస్తువులు కల్తీ చేయడం, నకిలీ నోట్ల చలామణీ, పేలుడు పదార్థాల రవాణా వంటి నేరాలు వెలుగుచూస్తున్నాయి. అయితే, ఈ ఘటనలపై ఫిర్యాదులు చేస్తే తప్ప పోలీసులు, ఇతర శాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
కొన్ని ఘటనలు ఇలా..
గతంలో జడ్చర్లలో భూ కబ్జాలు, ప్లాట్ల ఆక్రమణలు, ల్యాండ్ సెటిల్మెంట్ దందాలు జరిగేవి. ఇప్పుడు కల్తీ ఆహార ఉత్పత్తులు, పేలుడు పదార్థాల రవాణా, అమ్మాయిల న్యూడ్ కాల్స్ వంటి నేరాలు బయట పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నాలుగు నెలల కింద జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ మార్వాడి వ్యాపారి ఆశీర్వాద్ పైపుల పేరుతో వ్యాపారం చేశాడు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ కంప్లైట్ చేయడంతో అతడు నకిలీ పైపుల వ్యాపారం చేస్తున్న వ్యవహారం బయటపడింది. జనవరి 31న కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో పోలీసులు పెద్దమొత్తంలో జిలెటిన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్నుంచి తీసుకొచ్చిన ఈ పేలుడు పదార్థాలను ఓ వ్యక్తి ఇక్కడ పెట్టి రహస్యంగా అమ్ముతున్నాడు. పోలీసులు దాడి చేసి 10 బాక్సులకు పైగా జిలెటిన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నేతాజీ చౌరస్తా సమీపంలోని మరో వ్యాపారి ప్యారాచూట్ కంపెనీ పేరుతో డూప్లికేట్ కొబ్బరినూనెను అమ్మాడు. కంపెనీ ప్రతినిధులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. ఇటీవల ఓ వ్యక్తి దుబాయ్కరెన్సీ మార్చుతుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు కొందరు అక్రమ వ్యాపారాలకు సేఫ్ప్లేస్గా జడ్చర్లను ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
సంచలనంగా మారిన న్యూడ్ కాల్స్
'మీ ఫొటోలు, ప్రత్యేకించి హస్తరేఖల ఫొటోలు పంపితే స్వామీజీ మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతూ.. కోట్ల రూపాయలు సమకూరేలా చేస్తారు' అని మహిళలను నమ్మించి వారి న్యూడ్ ఫొటోలు, వీడియోలు కలెక్ట్చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసుకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులతో పాటు హైదరాబాద్కు చెందిన ఓ బాబా హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయితే, ఉమ్మడి జిల్లాకు చెందిన నిందితుల మధ్య గొడవ జరగడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో ఫిబ్రవరి 18న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా వీరి ట్రాప్లో దాదాపు 30 మంది మహిళలు బాధితులుగా ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 10న జడ్చర్ల పట్టణంలోని ఓ రైల్మిల్లులో వడ్ల బస్తాల్లో రాళ్లు కలుపుతున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. 50 కేజీల బస్తాల్లో ఒక్కోదానిలో 10 నుంచి 15 కేజీల వరకు రాళ్లు కలుపుతుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాళ్లు కలిపిన మొత్తం 112 బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో ఆ మిల్లును సీజ్ చేశారు.
నేరాల కంట్రోల్కు చర్యలు
జడ్చర్లలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది కొరత ఉన్నా ప్రతి కేసును ఛేదిస్తున్నాం. జడ్చర్లలో స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు చాలా మంది ఉంటున్నారు. ఈక్రమంలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. కల్తీ వస్తువుల అమ్మకాలు, నకిలీ కరెన్సీ కేసులు, జిలెటిన్స్టిక్స్కేసులను ఛేదించాం. న్యూడ్ కాల్స్ వ్యవహారంలో నిందితులను పట్టుకొని రిమాండ్ చేశాం. –రమేశ్ బాబు, సీఐ, జడ్చర్ల
పనిచేయని సీసీ కెమెరాలు
జడ్చర్లలో సీసీ కెమెరాలు నామ్కే వాస్తేగా మారాయి. మొత్తం పట్టణం చుట్టూ 83 కెమెరాలు ఉండగా, అందులో 20 వరకు పని చేస్తలేవు. దీనికితోడు పోలీస్ సిబ్బంది కొరత ఉండడంతో ఉన్నవారిపైనే పనిభారం పడుతోంది. దీంతో కొంత క్రైమ్ రేట్కంట్రోల్చేయడం కత్తిమీద సాములా మారింది. అన్ని ఏరియాల్లో నిఘాను పటిష్టం చేయలేకపోతున్నారు.