
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా జిల్లా విద్యాశాఖలో అక్రమ డిప్యుటేషన్లు, రీప్యాట్రియేషన్లు, పోస్టింగులతో గందరగోళం నెలకొంది. విద్యాశాఖలో ఓ ఉన్నతాధికారి తనకు నచ్చిన వారికి అక్రమంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. రూల్ ప్రకారం వెళితే పనులు చేయడం లేదని పలువురు టీచర్లు చెబుతున్నారు. డిప్యుటేషన్లు, అక్రమ పోస్టింగులపై ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, వివిధ పార్టీల చోటామోటా నాయకులు పైరవీలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.
రూల్స్ పాటించట్లే..
- గత ఏడాది ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చారు. ఇంగ్లిష్ ప్రమోషన్ పొందిన టీచర్లలో సీరియల్ నంబర్ 1 నుంచి 16 వరకు రోస్టర్లో ఉన్న వారిలో కొందరు గైర్హాజరయ్యారు. వారి నంబర్ల నుంచి కాకుండా 17వ నంబర్ నుంచి రోస్టర్ ఫిక్స్ చేయడంతో మెరిట్ ఉన్న తమకు అన్యాయం జరిగిందని పలువురు టీచర్లు కోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత స్కూల్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి జిల్లా కేంద్రంలోని హైస్కూల్కు డిప్యుటేషన్ వేశారు.
- డీఈవో ఆఫీస్లో ఫారెన్ సర్వీసెస్ కింద ఇద్దరు టీచర్లు వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. వారు రీప్యాట్రియేషన్ కింద గతంలో పని చేసిన స్కూళ్లకే వెళతామనడంతో ఉత్తర్వులు ఇచ్చారు. ఒకరికి గతంలో పని చేసిన స్కూల్కే ఇవ్వగా, మరొకరికి ఆయన పని చేసిన స్కూల్లో ఖాళీ లేకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్కు కేటాయించారు. రీప్యాట్రియేషన్ ఉత్తర్వుల్లో ఫారెన్ సర్వీసెస్ కింద వెళ్లిన వారి ప్లేస్ ఖాళీ లేకుంటే అదే మండలంలోని పక్క స్కూల్ లేదంటే పక్క మండలంలో ఇవ్వాలని నిబంధన ఉంది. కానీ, సదరు టీచర్కు వెల్టూరులో ఖాళీ ఉన్నా జిల్లా కేంద్రంలో రీప్యాట్రియేషన్ ఇచ్చారు.
- కొత్తకోట మండలం నుంచి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంను గత ఏడాది జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్కు డిప్యుటేషన్ ఇచ్చారు. పాన్గల్ మండలంలోని ఓ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంను గోపాల్పేట మండలానికి డిప్యుటేషన్ ఇచ్చారు. పెద్దమందడి మండలంలోని ఓ స్కూల్ అసిస్టెంట్కు జిల్లా కేంద్రానికి సమీపంలోని స్కూల్కు, అదే మండలంలోని మరో స్కూల్ నుంచి ఖాళీ అయిన స్కూల్కు డిప్యుటేషన్ ఇచ్చారు. డిప్యుటేషన్ మీద వెళ్లిన వారు అకడమిక్ ఇయర్ ముగిసే రోజు పోస్టింగ్ ఉన్న స్కూల్లో రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ డిప్యుటేషన్ కోసం అప్లై చేసుకోవాలి. ఇవేమి లేకుండానే కొనసాగుతున్నారు.
కొత్తగా పోస్టులొచ్చినా?
డీఈవో ఆఫీస్కు ఇటీవల కొత్తగా ప్రమోషన్పై ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, గ్రూప్–-4 కింద ముగ్గురు సిబ్బంది వచ్చారు. అయినప్పటికీ ఫారెన్ సర్వీసెస్, అడిషనల్ చార్జ్ కింద స్కూళ్లలో పని చేసే టీచర్లను తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. పాన్గల్ మండలంలోని ఓ ప్రైమరీ స్కూల్లో ముగ్గురు టీచర్లు ఉండగా, ఒకరు డీఈవో ఆఫీస్లో ఫారెన్ సర్వీసెస్ కింద చేరారు. అక్కడి హెచ్ఎం ఈ నెలాఖరులో రిటైర్ కానున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఈ స్కూల్లో మరో వారం రోజుల తరువాత ఒక్క టీచరే ఉండనున్నారు.
డీసీఈబీ సెక్రటరీ పోస్టు నుంచి ఒకరిని తప్పించి, మరొకరిని తీసుకోవడంపై రచ్చ జరిగింది. ఇలా విద్యాశాఖలో డిప్యుటేషన్లు, ఫారెన్సర్వీస్, అడిషనల్ చార్జి పేరుతో అక్రమాలు జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ విషయమై డీఈవో అబ్దుల్ ఘనిని ఫోన్లో సంప్రదించగా, ఆయన స్పందించలేదు.