తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏప్రిల్ 19, 20, 21 తేదీలలో వర్షపాతం, ఉష్ణోగ్రత తగ్గుదల ఉంటుందని తెలిపింది.ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 20నాడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుముల మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ 21న పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలలో వానలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. దీని వల్ల రాష్ట్రంలో 36 నుంచి -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ అంచనా వేసింది.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, 2024 ఏప్రిల్ 16 నాడు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటాయి. భద్రాద్రి కొత్తగూడెంలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, నల్గొండ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొమురం భీం, కరీంనగర్, సూర్యాపేట జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటినట్టు తెలిపింది.తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని హైదరాబాద్లోని ఐఎండీ అంచనా వేసింది.