
న్యూఢిల్లీ: రానున్న రెండ్రోజుల్లో దేశంలోని ఏడు రాష్ట్రాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. పాకిస్తాన్ నుంచి ఈ వేడి గాలులు దేశంలోకి ప్రవేశించనున్నాయని చెప్పింది. దీని ప్రభావంతో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుందని గురువారం వెల్లడించింది. సాధారణం కంటే 6.5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఢిల్లీలో నార్మల్గా జూన్ 20 వరకు వేడి గాలులు ఉంటాయి. అయితే రుతుపవనాల ఆలస్యంతో ఎండల తీవ్రత ఇప్పటికీ ఎక్కువగా ఉందని ఐఎండీ రీజనల్ ఆఫీసర్ కుల్దీప్ శ్రీవాస్తవ చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ లో రికార్డు స్థాయిలో 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైందని, ఈ యేడు ఇదే రికార్డు అని తెలిపారు.
కెనడాలో ఎండలకు 486 మంది మృతి
బ్లూమ్బర్గ్: కెనడాలో చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమ కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో 49.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డయ్యింది. ఎండల ధాటికి ఐదు రోజుల్లోనే అక్కడ 486 మంది చనిపోయారు. మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కెనడాలోని లిట్టన్, బ్రిటిష్ కొలంబియాలో జూన్ నెలలో వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. అయితే ఈసారి ఎండలు మండుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వాంకోవర్లో ఎండ వేడికి తట్టుకోలేక ఏసీ హోటళ్లకు పరుగులు తీస్తున్నారు. రూమ్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు.