పట్టపగలు నడిరోడ్డుపై బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన ఢిల్లీలో జరిగింది. దేశ రాజధానిలో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాలూకు వివరాలను పోలీసులు వెల్లడించారు. చాందినీ చౌక్ లో డెలివరీ ఏజెంట్గా పని చేస్తున్న ఓ వ్యక్తి, అతని సహచరుడు రూ.3.5 లక్షలతో తమ కారులో గుర్గావ్ వెళ్తున్నారు. థక్ థక్ గ్యాంగ్కి చెందిన నలుగురు దుండగులు వారిని వెనక నుంచి ఫాలో అయ్యారు. ప్రగతి మైదాన్ సొరంగంలోకి రాగానే కారు ముందు వారి బైక్ లను అడ్డుగా ఆపారు.
వెంటనే దిగి తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో కారులో ఉన్న ఇరువురిని బెదరించారు. రూ.3.5 లక్షలు ఉన్న బ్యాగ్ తీసుకుని అక్కడ నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో పక్కనే వెళ్తున్న వాహనదారులు ఏం జరుగుతోందో గమనించే లోపే పని పూర్తి చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు తో తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జూన్24 న జరిగింది.
ALSO READ:కేసీఆర్ తో పెట్టుకున్న వాళ్లెవరూ బాగుపడలే: కేటీఆర్
ఎల్జీ రాజీనామా చేయాలి..
దోపిడీ సంబంధించిన వీడియోను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలు పర్యవేక్షించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ఢిల్లీని కాపాడలేని పరిస్థితిలో ఉంటే తమకు ఆ బాధ్యతలు అప్పగించాలన్నారు. తాము శాంతి భద్రతలు కాపాడతామని కేజ్రివాల్ చెప్పారు.