క్యూ 3 లో రూ. 8.77 కోట్లే
న్యూఢిల్లీ : డిసెంబర్ 2022 తో ముగిసిన క్యూ 3 లో అదానీ పవర్ నికర లాభం 96 శాతం తగ్గి రూ. 8.77 కోట్లకు పరిమితమైంది. ఖర్చులు ఎక్కువవడం వల్లే లాభాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. అంతకు ముందు ఏడాది క్యూ 3 లో అదానీ పవర్కు రూ. 218.49 కోట్ల లాభం వచ్చింది. తాజా క్యూ 3 లో రెవెన్యూ రూ. 8,290.21 కోట్లకు పెరిగినప్పటికీ, ఖర్చులు భారీగా రూ. 8,078.31 కోట్లకు చేరడంతో నికర లాభం తగ్గిపోయినట్లు అదానీ పవర్ బీఎస్ఈ ఫైలింగ్లో వెల్లడించింది. డిసెంబర్ 2022 క్వార్టర్లో తమ కంపెనీ, సబ్సిడరీలు కలిపి 42.1 శాతం ఏవరేజ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధించినట్లు వివరించింది. ఇదే కాలానికి 11.8 బిలియన్ యూనిట్ల కరెంటు అమ్మినట్లు పేర్కొంది. మార్చి 2022 లో చేజిక్కించుకున్న మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్ 1200 మెగావాట్ల రిజల్ట్స్ కూడా తాజా క్యూ 3 లో కలిసే ఉన్నట్లు వివరించింది. బొగ్గు దిగుమతి బాగా ఖరీదైందని, దేశీయంగా ఫ్యూయెల్ దొరకడం లేదని అదానీ పవర్ తెలిపింది. గ్రీన్ఫీల్డ్స్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, నిర్వహణలో అదానీ పవర్కు మెరుగైన రికార్డు ఉందని, ఖాయిలా పడిన పవర్ ప్లాంట్లను కొనుగోలు చేసి వాటిని టర్న్ అరౌండ్ చేయడంలోనూ తమకు నైపుణ్యం ఉందని అదానీ పవర్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా చెప్పారు. రెగ్యులేటరీ సమస్యలు చాలా వరకు పరిష్కారం కావడంతోపాటు, తగినంత లిక్విడిటీ అందుబాటులో ఉండటం వల్ల గ్రోత్ మెరుగ్గానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆరు సబ్సిడరీలను అదానీ పవర్లో విలీనం చేసే ప్రపోజల్కు సెక్యూర్డ్ క్రెడిటార్ల నుంచి అనుమతి వచ్చింది. త్వరలోనే ఈ ప్రాసెస్ పూర్తవుతుందని కంపెనీ వెల్లడించింది.
అదానీ విల్మార్ లాభం రూ. 246.11 కోట్లు
ఎడిబుల్ ఆయిల్ రంగంలోని అదానీ విల్మార్ లాభం క్యూ 3 లో 15 శాతం పెరిగి రూ. 246.11 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ 3 లో కంపెనీ లాభం రూ. 211.41 కోట్లు మాత్రమే. తాజా క్యూ 3 లో రెవెన్యూ కూడా రూ. 15,515.55 కోట్లకు ఎగసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. కాకపోతే డిసెంబర్ 2022 తో ముగిసిన 9 నెలల కాలానికి చూస్తే కంపెనీ నికర లాభం తగ్గిపోయింది. 9 నెలల కాలంలో కంపెనీకి రూ. 44,501.14 కోట్ల రెవెన్యూపై రూ. 488.51 కోట్ల లాభం వచ్చింది. ఫార్చూన్ బ్రాండ్ పేరుతో వంట నూనెలతో పాటు మరికొన్ని ఫుడ్ ప్రొడక్టులను ఈ కంపెనీ అమ్ముతోంది.
అదానీ హైడ్రోజన్ పార్టనర్షిప్ ఆగింది
అదానీ గ్రూప్ తలపెట్టిన 50 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ ప్రాజెక్టు పార్టనర్షిప్ను హోల్డ్లో పెడుతున్నట్లు ఫ్రాన్స్ కంపెనీ టోటల్ ఎనర్జీస్ ప్రకటించింది. యూఎస్ షార్ట్ సెల్లర్ ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది. కిందటేడాది జూన్లోనే చేతులు కలుపుతున్నట్లు ఈ రెండు కంపెనీలు ప్రకటించాయి. కానీ, కాంట్రాక్టుపై టోటల్ ఎనర్జీస్ ఇంకా సంతకాలు చేయలేదని ఆ కంపెనీ సీఈఓ ప్యాట్రిక్ పౌయాన్ ఎర్నింగ్స్ కాల్లో తెలిపారు. జూన్ 2022 చేసిన ప్రకటన ప్రకారం అదానీ హైడ్రోజన్ ప్రాజెక్టులో 25 శాతం వాటా తీసుకోవడానికి టోటల్ ఎనర్జీస్ ఆసక్తి చూపించింది. క్లారిటీ వచ్చే దాకా ఈ ప్రాజెక్టును హోల్డ్లో పెడుతున్నట్లు సీఈఓ తాజాగా వెల్లడించారు.