
30 బిలియన్ డాలర్లు ఇచ్చిన యూఎస్ టాప్ బ్యాంకులు
న్యూఢిల్లీ : యూఎస్లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంకులు ఇప్పటికే దివాలా తీశాయి. అక్కడి ప్రభుత్వం వీటి ఆస్తులను సీజ్ చేయడం, కార్యకలాపాలను తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం జరిగింది. మరో రీజినల్ బ్యాంక్ దివాలా తీయకముందే యూఎస్ టాప్ బ్యాంకులు ముందుకొచ్చి, ఆర్థిక సాయం అందించాయి. దివాలా లిస్టులో తర్వాత ప్లేస్లో ఉన్న ఫస్ట్ రిపబ్లిక్కు ఏకంగా 30 బిలియన్ డాలర్ల డిపాజిట్లను అందించడానికి జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్, వెల్స్ ఫర్గో అండ్ కో, గోల్డ్ మ్యాన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ జట్టుకట్టాయి. యూకే ఆర్థిక మంత్రి జానెట్ యెల్లన్, ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్, జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డిమాన్లు ఈ రెస్క్యూ ప్లాన్ను రెడీ చేశారు. కాగా, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయకుండా 30 బిలియన్ డాలర్లను యూఎస్ పెద్ద బ్యాంకులు డిపాజిట్ చేశాయి. ఇండియాలో యెస్ బ్యాంక్ దివాలా బాట పట్టినప్పుడు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కోటక్, ఐసీఐసీఐ వంటి టాప్ బ్యాంకులు ఇన్వెస్ట్ చేసి, ఈ ప్రైవేట్ బ్యాంక్ను కాపాడాయి.
మార్కెట్లో తగ్గిన ఆందోళనలు..
యూఎస్లో బ్యాంకింగ్ క్రైసిస్ మొదలయినప్పటి నుంచి గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో భయాందోళనలు ఎక్కువయ్యాయి. డొమెస్టిక్ మార్కెట్లు భారీగా పడడం చూశాం. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ దివాలా తీసిందనే వార్తలు వెలువడే ముందే టాప్ బ్యాంకులు ముందుకు రావడం ఫైనాన్షియల్ మార్కెట్కు కొంత ఊరటనిచ్చింది. 70 బిలియన్ డాలర్ల ఫండ్స్ను యాక్సెస్ చేసుకోవడానికి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్కు జేపీ మోర్గాన్ వారం కిందటే వీలు కల్పించింది. సిగ్నేచర్ బ్యాంక్ కూడా దివాలా తీయడంతో ఈ ఎఫెక్ట్ ఫస్ట్ రిపబ్లిక్ షేర్లలో కనిపించ లేదు. ఎస్వీబీ క్రైసిస్ బయటపడ్డాక ఈ బ్యాంక్ షేర్లు 70 శాతం మేర పడ్డాయి. 30 బిలియన్ డాలర్ల ఫండ్స్ వస్తుండటంతో ఫస్ట్ రిపబ్లిక్ షేర్లు గురువారం 10 శాతం లాభపడ్డాయి. కానీ, డివిడెండ్లను ఆపేస్తామని ప్రకటించడంతో శుక్రవారం 25 శాతం పడ్డాయి. రెస్క్యూ ప్లాన్ బయటకు రావడంతో యూఎస్ బ్యాంక్ షేర్లు గురువారం లాభాల్లో కదిలిన జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్లు శుక్రవారం సెషన్లో నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎస్ అండ్ పీ 500, డోజోన్స్, నాస్డాక్ ఇండెక్స్లు ఒకటిన్నర శాతం నష్టపోయాయి.
ఎమర్జెన్సీ ఫండ్సే దిక్కు..
ఫైనాన్షియల్ క్రైసిస్ (2008) తర్వాత ఎమర్జెన్సీ ఫండ్స్ వైపు చూసిన అతిపెద్ద బ్యాంక్గా స్విస్ బ్యాంక్ క్రెడిట్ స్వీస్ నిలిచిన విషయం తెలిసిందే. వడ్డీ రేట్లు పెరగడంతో వ్యవస్థలో లిక్విడిటీ కొరత నెలకొంది. దీంతో చాలా బ్యాంకులు ఫండ్స్ సేకరించడంలో ఇబ్బంది పడుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ నుంచి బ్యాంకులు ఎమర్జెన్సీ ఫండ్స్ తీసుకోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెద్దగా పెంచకపోవడంతో డిపాజిటర్లను ఆకర్షించలేకపోతున్నాయి.
యూఎస్ బ్యాంకింగ్ క్రైసిస్..టీసీఎస్, ఇన్ఫోసిస్కు దెబ్బ
యూఎస్ రీజినల్ బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకోవడం టీసీఎస్, ఇన్ఫోసిస్ల రెవెన్యూపై ప్రభావం చూపనుంది. ఈ కంపెనీల రెవెన్యూల్లో 2–3 శాతం వాటా యూఎస్ రీజినల్ బ్యాంకుల నుంచే ఉందని జేపీ మోర్గాన్ ప్రకటించింది. తాజాగా దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్కి బాగానే రెవెన్యూ వస్తోందని తెలిపింది.‘ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంక్లు దివాలా తీయడం, యూఎస్, యూరప్లలో లిక్విడిటీ సమస్యలు నెలకొనడం ఐటీ కంపెనీల ప్రభావం చూపనున్నాయి. చాలా బ్యాంకులు తమ ఐటీ ఖ ర్చులను తగ్గించుకోవచ్చు’ అని జేపీ మోర్గాన్ వెల్లడించింది. ఐటీ సెక్టార్ షేర్లకు ఈ కంపెనీ అండర్వెయిట్ రేటింగ్ ఇచ్చింది. గ్లోబల్గా వడ్డీ రేట్లు పెరగడంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ఐటీ సెక్టార్కు బ్యాంకింగ్ సంక్షోభం మరో షాకిచ్చిందని చెప్పాలి. దేశ ఐటీ కంపెనీల రెవెన్యూలు వచ్చే నాలుగు క్వార్టర్లలో తగ్గొచ్చని జేపీ మోర్గాన్ అంచనావేసింది. కాగా, దేశ ఐటీ కంపెనీలకు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తోంది. ఈ సెగ్మెంట్ నుంచి వచ్చే రెవెన్యూలో 62 శాతం వాటా యూఎస్ బ్యాంకులది, 23 శాతం వాటా యూరప్ బ్యాంకులది ఉంది.