మథుర: రెక్కాడితే కానీ డొక్కాడని ఓ రిక్షావాలాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. అది కూడా రూ. 3.47 కోట్లు పన్ను చెల్లించమని ఆదేశాలు ఇవ్వడంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని మథుర జిల్లాలో వెలుగుజూసింది. వివరాలు.. మథుర జిల్లాలోని బకల్పూర్కు చెందిన ప్రతాప్ సింగ్ది పేద కుటుంబం. రిక్షా నడుపుకుంటూ బతుకు బండి లాగిస్తున్న ప్రతాప్.. అన్ని ఖర్చులు పోగా కొంత డబ్బును బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటున్నాడు. అయితే, తన ఖాతాకు పాక్ కార్డ్ను అనుసంధానం చేయడాలని బ్యాంక్ అధికారులు చెప్పడంతో స్థానిక జన్ సువిధ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు సంజయ్ సింగ్ అనే ఓ వ్యక్తి ప్రతాప్కు పాన్ కార్డ్ కలర్ జిరాక్స్ కాపీ ఇచ్చాడు.
నిరక్షరాస్యుడైన ప్రతాప్ ఈ కార్డు నకిలీదని గుర్తించలేకపోయాడు. ఇదిలా ఉండగా.. ఈ నెల 19న ప్రతాప్కు ఐటీ ఆఫీసర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ. 3.47 కోట్లు పన్ను చెల్లించాలని అతడికి నోటీసులు అందాయి. దీంతో కంగారుపడ్డ ప్రతాప్.. తాను రిక్షా నడిపేవాడినని చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విచారణ చేయగా.. ప్రతాప్ పేరుతో జీఎస్టీ తీసుకుని ఎవరో వ్యాపారం చేస్తున్నారని తేలింది. ఆ కంపెనీ టర్నోవర్ ఏడాదికి రూ. 43 కోట్లని తెలుసుకున్నారు దీంతో ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.