ఖర్చు పెంచండి- ప్రభుత్వ కంపెనీలకు ఆర్ధిక మంత్రి సూచన

ఖర్చు పెంచండి- ప్రభుత్వ కంపెనీలకు ఆర్ధిక మంత్రి సూచన

డిసెంబర్ కల్లా క్యాపెక్స్ టార్గెట్ లో 75 శాతానికి చేరుకోవాలి

న్యూఢిల్లీ: ప్రాజెక్టుల విస్తరణ పనులను మరింత చురుగ్గా అమలు చేయమని ప్రభుత్వరంగ కంపెనీలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ సూచించారు. ఇందుకోసం కేటాయించిన మొత్తాలను టార్గెట్​కు అనుగుణంగా ఖర్చుపెట్టాలని చెప్పారు.  తమ క్యాపెక్స్‌‌(మూల ధన ఖర్చులు) టార్గెట్‌‌లో 75 శాతాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి చేరుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌‌ కంపెనీలను ఆదేశించారు. పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్‌‌, కోల్‌‌ మినిస్ట్రీలకు చెందిన సెక్రటరీలతో పాటు, ఈ మినిస్ట్రీలకు చెందిన14 ప్రభుత్వ కంపెనీల చైర్మన్‌‌లు, మేనేజింగ్ డైరక్టర్లతో వర్చువల్‌‌గా  సమావేశమయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,15,934 కోట్లను క్యాపెక్స్‌‌ కోసం వినియోగించాలని ఈ కంపెనీలు టార్గెట్‌‌గా పెట్టుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంబంధించి ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ వివిధ స్టేక్ హోల్డర్లతో వరుస మీటింగ్‌‌లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం 2020–21, 2021–22 లలో ఎకానమీ రికవరీలో ప్రభుత్వ కంపెనీల క్యాపెక్స్‌‌ కీలకంగా ఉంటాయని సీతారామన్ అన్నారు. ఈ కంపెనీలు తమ  క్యాపెక్స్‌‌ టార్గెట్‌‌లో 75 శాతాన్ని డిసెంబర్ చివరినాటికి  చేరుకోవడాన్ని  సంబంధిత సెక్రటరీలు ఎప్పటికప్పుడు మానిటర్‌‌‌‌ చేయాలని చెప్పారు. ఈ టార్గెట్‌‌ చేరుకోవడంలో కంపెనీల చైర్మన్‌‌, ఎండీలు ఎక్కువగా పనిచేయాలని అన్నారు.

ఇప్పటికే 37,423 కోట్ల ఖర్చు

2019–20 లో రూ. 1,11,672 కోట్లను క్యాపెక్స్‌‌ కింద వాడాలని ఈ 14 కంపెనీలు టార్గెట్‌‌ పెట్టుకోగా, రూ.  రూ. 1,16,323 కోట్లను ఖర్చు చేయగలిగాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,15,934 కోట్లను  క్యాపెక్స్‌‌ కోసం వినియోగించాలని టార్గెట్‌‌గా పెట్టుకోగా, ఇందులో రూ. 37,423 కోట్లను మొదటి ఆరు నెలల్లోనే ఖర్చు చేశాయి. ఇది టార్గెట్‌‌లో 32 శాతానికి సమానం. కానీ గతేడాది ఇదే టైమ్‌‌లో టార్గెట్‌‌లో 39 శాతాన్ని(రూ.43,097 కోట్లు) ఈ కంపెనీలు సాధించాయి.  కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థ రికవరీ అవ్వడం ప్రభుత్వ కంపెనీల పెర్ఫార్మెన్స్‌‌పై ఆధారపడి ఉంటుందని సీతారామన్‌‌ చెప్పారు. కాగా, ప్రభుత్వ కంపెనీల క్యాపెక్స్‌‌లను డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ ఎకనామిక్‌‌ అఫైర్స్‌‌, డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ పబ్లిక్‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌లు కలిసి రివ్యూ చేస్తాయి.

ప్రభుత్వం ఓకే చెబితేనే..

ఇండియన్‌‌ కంపెనీలలో చైనీస్‌‌ హోల్డింగ్‌‌ ఎంతున్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఎఫ్‌‌డీఐ ప్రపోజల్స్‌‌ పేర్కొంటున్నాయి. ఈ ప్రపోజల్స్‌‌ను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. గతంలో  కొంత లిమిట్‌‌ను పెట్టాలని, ఆ లిమిట్‌‌ను దాటి చైనీస్‌‌ హోల్డింగ్‌‌ ఉంటే అనుమతి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ తాజా ఫారిన్‌‌ డైరక్ట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌(ఎఫ్‌‌డీఐ) ప్రపోజల్స్‌‌ను చూస్తుంటే ఎటువంటి లిమిట్‌‌ను పెట్టేందుకు ప్రభుత్వం రెడీగా లేదని తెలుస్తోంది. బార్డర్‌‌‌‌ దేశాల నుంచి ఇండియాలోకి వచ్చే ఇన్వెస్ట్‌‌మెంట్లు ప్రభుత్వ పరిశీలనలో ఉండాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేబినేట్‌‌ ఆమోదం తెలిపింది. ఈ ఇన్వెస్ట్‌‌మెంట్ల లిమిట్‌‌ను కంపెనీలో 10 శాతంగా లేదా 25 శాతంగా ఉంచాలని ప్రభుత్వం చర్చించింది కూడా.  ఒకవేళ ఈ రూల్స్‌‌ అమలులోకి వస్తే పేటీఎం, జొమాటో, బిగ్‌‌బాస్కెట్‌‌ వంటి కంపెనీలు ఇబ్బందుల్లో పడతాయి. ఈ కంపెనీలలో చైనీస్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్లు ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి గైడ్‌‌లైన్స్‌‌ను ప్రిపేర్‌‌‌‌ చేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్‌‌ గ్రూప్‌‌ తాజాగా సమావేశమయ్యిందని తెలిసిన వ్యక్తులు అన్నారు. ఈ గ్రూప్‌‌లో కామర్స్‌‌, పవర్‌‌‌‌, టెలికాం మినిస్ట్రీలు ఉన్నాయని తెలిపారు. ఎఫ్‌‌డీఐ గైడ్‌‌లైన్స్‌‌ను ఈ మినిస్టీరియల్‌ గ్రూప్‌‌ రెడీ చేయనుందని అన్నారు. రానున్న కొన్ని రోజుల్లో ఈ గైడ్‌‌లైన్స్‌‌ను ఖరారు చేయనుందని పేర్కొన్నారు. హాంకాంగ్‌‌, తైవాన్‌‌ నుంచి వచ్చే ఇన్వెస్ట్‌‌మెంట్ల గురించి ఇందులో ప్రస్తావించొచ్చని తెలిపారు. ఈ నిబంధనలలో ఎటువంటి మార్పు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు.

బై బ్యాక్ చేపట్టండి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్ల బై బ్యాక్‌‌ను చేపట్టడాన్ని పరిశీలించాలని ఎనిమిది ప్రభుత్వ రంగ కంపెనీలను గవర్నమెంట్ అడిగిందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. బై బ్యాక్‌‌ను చేపట్టడంతో ఈ కంపెనీల షేరు విలువ పెరగడంతో పాటు, షేర్‌‌‌‌ హోల్డర్లకు డబ్బులు అందుతాయి. ఈ ఎనిమిది కంపెనీలలో కోల్‌ ఇండియా, ఎన్‌‌టీపీసీ, ఎన్‌‌ఎండీసీ, ఇంజినీర్స్‌‌ ఇండియా వంటి సంస్థలున్నాయని తెలిసిన వ్యక్తులు అన్నారు. ఆయిల్‌ సెక్టార్లోని ప్రభుత్వ కంపెనీలు బై బ్యాక్‌‌ను చేపట్టలేకపోవచ్చని చెప్పారు. ఈ కంపెనీలలో ప్రభుత్వం వాటానే ఎక్కువగా ఉండడం, పబ్లిక్‌‌ వద్ద తక్కువ వాటానే ఉండడం దీనికి కారణమని అన్నారు. కొన్ని ప్రభుత్వ కంపెనీలు ఇప్పటికే క్యాపెక్స్‌‌ టార్గెట్‌ లను, డివిడెండ్‌ పేమెంట్లను చేపడుతున్నాయని అన్నారు. దీంతో బై బ్యాక్‌‌ను చేపట్టేందుకు ఈ కంపెనీల వద్ద అవసరమైన నిధులు అందుబాటులో ఉండకపోవచ్చన్నారు. తమ క్యాపెక్స్‌‌ టార్గెట్‌ లను చేరుకోవడం లేదా డివిడెండ్‌ల రూపంలో షేర్‌‌‌‌హోల్డర్లకు డబ్బులందించడమో చేయాలని ప్రభుత్వ కంపెనీలను గవర్న్‌‌మెంట్ అడిగిందని తెలిసిన వ్యక్తులు అన్నారు.