
బిజినెస్ డెస్క్, వెలుగు: సీరియస్గా ఏదో పనిలో ఉంటాం. సడెన్గా ఫోన్ రింగ్ అవుద్ది. చూసేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్కు మీరు సెలెక్ట్ అయ్యారని, రోజుకి రూ.8 వేల నుంచి రూ. 30 వేలు సంపాదించొచ్చని మెసేజ్లో ఉంటుంది. లేదా రూ. 5 లక్షల ప్రీ–అప్రూవ్డ్ లోన్ మీకు ఓకే అయ్యిందని ఉంటుంది. ఇలా
అడగకుండానే ప్రతి రోజు అనేక సార్లు అనవసరమైన మెసేజ్లు, ఫోన్ కాల్స్ యూజర్లను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. అంతేకాకుండా డైరెక్ట్గా మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ అకౌంట్కు కూడా స్పామ్ మెసేజ్లు రావడం పెరిగింది. ‘మీ మొబైల్ను వైరస్ నుంచి రక్షించుకోండి’ అంటూ ఒక్క రోజులోనే ఐదు సార్లు మెసేజ్ వచ్చిందని హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కొనిరెడ్డి అనిల్ అన్నారు. ఓ లింక్ పంపి దానిని క్లిక్ చేయమంటూ తెగ మెసేజ్లు వచ్చాయని చెప్పారు. కేవలం ఆయనే కాదు ఇలా అడగకుండానే మెసేజ్లు, కాల్స్ వస్తున్నాయని చాలా మంది యూజర్లు పేర్కొన్నారు. ట్రేడింగ్ కాల్స్ చెబుతామని కొందరు, లోన్స్ తీసుకోండంటూ మరికొందరు తెగ ఫోన్లు చేస్తున్నారని సిటీకి చెందిన మరో ఐటీ ఉద్యోగి ఎం రఘురామ్ వివరించారు. ప్రతి రోజు గుర్తుతెలియని కాలర్లను, మెసేజ్లను బ్లాక్ చేస్తున్నానని చెప్పారు. రోజుకి 2–3 స్పామ్ కాల్స్ వస్తున్నాయని, వారంలో కనీసం 4 నుంచి 5 స్పామ్ మెసేజ్లు వస్తున్నాయని అన్నారు.
స్పామ్లు పెరిగాయా!
మరి ఈ నెంబర్లన్నీ ఏం చెబుతున్నాయి? టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ పీడీ వఘెల్ మాత్రం గతేడాదితో పోలిస్తే స్పామ్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ 15 % తగ్గాయని అన్నారు. కానీ, ఇందుకు సంబంధించిన డేటాను మాత్రం ఆయన బయటపెట్టలేదు. మరోవైపు లోకల్సర్కిల్స్ మాత్రం స్పామ్ పెరిగిందని పేర్కొంది. మొత్తం 57 వేల మంది మొబైల్ సబ్స్క్రయిబర్ల నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ కంపెనీ తన సర్వే రిపోర్ట్ను బయటపెట్టింది. ప్రతి రోజు ప్రమోషనల్ మెసేజ్లు లేదా స్పామ్ వస్తున్నాయని ఈ సర్వేలో పాల్గొన్నవారు అందరూ పేర్కొనడం గమనార్హం. డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) ఎంచుకున్నా రోజుకి కనీసం నాలుగు లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ మెసేజ్లు వస్తున్నాయని 68 % మంది పేర్కొన్నారు. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్పామ్స్ రావడం పెరిగిందని లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. కిందటేడాది 35 వేల మంది మొబైల్ సబ్స్క్రయిబర్లను సర్వే చేసిన ఈ సంస్థ, 95 % మంది స్పామ్స్ వస్తున్నాయని చెప్పారని వివరించింది. వాట్సాప్ ద్వారా స్పామ్ రావడం ఈసారి బాగా పెరిగిందని, ఈ విషయంపై చాలా మంది ఫిర్యాదు చేశారని లోకల్సర్కిల్స్ ఫౌండర్ సచిన్ తాపారియా అన్నారు. ఈ ట్రెండ్ను తమ సర్వే నిర్ధారించిందని చెప్పారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 95 % మంది తమకు ప్రతి రోజు వాట్సాప్ ద్వారా స్పామ్ మెసేజ్లు వస్తున్నాయని చెప్పారు. రోజుకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ లేదా ప్రమోషనల్ మెసేజ్లు వాట్సాప్ ద్వారా వస్తున్నాయని 51 % మంది వివరించారు. ఈ సర్వే ప్రకారం, 44 % మంది రోజుకి ఒకటి నుంచి మూడు స్పామ్ మెసేజ్లు రిసీవ్ చేసుకుంటున్నారు. వాట్సాప్ ద్వారా రోజుకి 4 నుంచి 7 స్పామ్ మెసేజ్లు వస్తున్నాయని 29 % మంది, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ వస్తున్నాయని 22 % మంది అన్నారు.
మారిన రూట్..
మనం అనుమతి ఇవ్వకపోయినా వచ్చే మెసేజ్లు లేదా కాల్స్ను స్పామ్స్ అంటున్నారు. ఈ డెఫినిషన్లో ఎటువంటి మార్పు లేకపోయినా, స్పామర్లు మాత్రం కొత్త రూట్ను ఎంచుకుంటున్నారు. టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడంతో ఎస్ఎంఎస్ల కంటే వాట్సాప్, టెలిగ్రాం, సిగ్నల్ వంటి ఓటీటీల ద్వారా ఎక్కువగా స్పామ్ మెసేజ్లను లేదా కమర్షియల్ మెసేజ్లను పంపుతున్నారు. టెలిగ్రామ్లో అయితే స్పామ్ డిఫరెంట్గా ఉంది. యూజర్లు పర్మిషన్ లేకపోయినా వివిధ గ్రూప్లలో వారిని యాడ్ చేస్తున్నారు. స్పామ్లను ఆపడానికి రెగ్యులేషన్స్ ఉన్నాయని, కానీ మెసేజ్ల ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుందని ఫలితంగా స్పామర్లను ఆపడం ప్రభుత్వానికి కష్టంగా మారిందని ఈవై పార్టనర్ ముకుల్ శ్రీవాస్తవ అన్నారు. కొన్ని స్పామ్ మెసేజ్లు అయితే యూజర్లను మోసం చేయడాన్నే టార్గెట్గా పెట్టుకున్నాయి. ‘మీ కరెంట్ ఈ రోజు రాత్రి 8.30 తర్వాత ఆగిపోతుంది. మీరు ఈ దిగువను ఉన్న లింక్ను క్లిక్ చేయండి’ అంటూ మెసేజ్లూ వస్తున్నాయి. యూజర్లు ఈ లింక్ను క్లిక్ చేస్తే వారి అకౌంట్లలోని డబ్బులు మాయమవుతున్నాయి.
డీఎన్డీ పరిస్థితేంటి..?
డీఎన్డీ యాప్ను 2016 లో ట్రాయ్ తీసుకొచ్చింది. ఇందులో రిజిస్టర్ అయితే వారికి ప్రమోషనల్ మెసేజ్లు లేదా స్పామ్లు రాకుండా ఈ యాప్ సాయపడుతుంది. కానీ, లోకల్సర్కిల్స్ సర్వే ప్రకారం, ఈ యాప్ సరిగ్గా స్పామ్లను ఫిల్టర్ చేయడం లేదు. ట్రాయ్ వెబ్సైట్ ప్రకారం, ఈ యాప్లో సుమారు 23 కోట్ల మంది రిజిస్టర్ అయ్యి డీఎన్డీ సర్వీస్ను ఎంచుకున్నారు. రిజిస్టర్ అయిన టెలిమార్కెటర్లు 22 వేలే ఉండగా, ఇప్పటి వరకు 12 లక్షల ఇల్లీగల్ టెలీమార్కెటర్లను రద్దు చేశామని ట్రాయ్ డేటా చెబుతోంది. రిజిస్టర్ కాని టెలిమార్కెటర్లకు వ్యతిరేకంగా టెలికం కంపెనీలు కిందటేడాది 8,55,771 ఫిర్యాదులను అందుకున్నాయని ఈ ఏడాది ఏప్రిల్లో లోక్సభలో ప్రభుత్వం పేర్కొంది. అంతకుముందు ఏడాది ఈ నెంబర్ 3,07,043 గా ఉంది. పాత డీఎన్డీ మోడల్ టెక్స్ట్ మెసేజ్లు ప్రమాదకరమా? కాదా? అనే దానిపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. కానీ, వాట్సాప్ వంటి ఓటీటీల ద్వారా వచ్చే మెసేజ్లను ఈ మోడల్ ఫిల్టర్ చేయలేకపోతోంది. స్పామ్లు పెరగడానికి మరోకారణం కూడా లేకపోలేదు. షాపింగ్ మాల్స్కు లేదా రిటైల్ స్టోర్లకు వెళ్లినప్పుడు మన దగ్గర నుంచి ఫోన్ నెంబర్లు తీసుకోవడం పెరిగింది. ఈ నెంబర్లు బ్లాక్ మార్కెట్లో కనీసం రూ.1,000 లకే అమ్ముకుంటున్నారని తెలిసింది. వినియోగదారుల ఫోన్ నెంబర్లు తీసుకొని షాపింగ్ మాల్స్ లేదా రిటైల్ స్టోర్లు, ఆన్లైన్ సైట్లు తమ ప్రమోషనల్ మెసేజ్లను ఎప్పటికప్పుడు పంపడం పెంచాయి. ఒక్కసారి నెంబర్ ఇస్తే చాలు వాట్సాప్లో కూడా ప్రమోషనల్ లేదా స్పామ్ మెసేజ్లు వస్తున్నాయి. చట్ట విరుద్ధంగా పనిచేసే స్పామర్లు, కాలర్లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని డాట్కు చెందిన ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. సింగపూర్లో సర్వర్లను మెయింటైన్ చేస్తూ లోకల్గా స్పామ్ మెసేజ్లను పంపుతున్న ఓ యాప్ను బ్యాన్ చేశామన్నారు. బ్యాంక్లతో సహా రిజిస్టర్ చేసుకున్న టెలిమార్కెటర్ల కమర్షియల్ మెసేజ్ల రికార్డ్లను మెయింటైన్ చేయాలని టెలికం కంపెనీలకు ఆదేశించామని పేర్కొన్నారు. రిజిస్టర్ కాని టెలిమార్కెటర్లను బ్లాక్లిస్ట్లో పెడుతున్నామన్నారు.