ఎడ్టెక్, ఈలెర్నింగ్, హెల్త్ కేర్ సెక్టార్లో పెరిగిన హైరింగ్
ముంబై: జాబ్ మార్కెట్లో ఫ్రెషర్స్కు డిమాండ్ పెరుగుతోంది. లాక్డౌన్తో ఫ్రెషర్స్ ఎక్కువగా నష్టపోయారు. క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయినా కూడా ఫ్రెషర్స్కు కంపెనీలు ప్లేస్మెంట్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ ధోరణి మారుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి ఫ్రెషర్స్కు డిమాండ్ పెరుగుతూ వస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఈ ట్రెండ్ కొనసాగుతుందని అంచనావేస్తున్నారు. ఎడ్టెక్, ఈలెర్నింగ్, హెల్త్ కేర్, హెచ్ఆర్ టెక్, ఫిన్టెక్ వంటి సెక్టార్లలో ఫ్రెషర్స్ను తీసుకోవడం పెరిగింది. ఫ్రెషర్స్ హైరింగ్ మార్చి 25–ఏప్రిల్ 30 మధ్యలో కేవలం 1.5 లక్షలుగానే ఉందని జాబ్ పోర్టల్ ఫ్రెషర్స్వరల్డ్ డాట్ కామ్ బిజినెస్ హెడ్ కౌషిక్ బెనర్జీ అన్నారు. ఇది నెలవారీ యావరేజి 5 లక్షల కంటే చాలా తక్కువని చెప్పారు. ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోందని, మా పోర్టల్లో 3.5 లక్షల ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ లిస్ట్ అయ్యాయని అన్నారు. జూన్ చివరి నుంచి ఫ్రెషర్స్ హైరింగ్ పెరుగుతూ వస్తోందని, సెప్టెంబర్–నవంబర్లో ఫ్రెషర్స్ డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనావేశారు. ఎడ్టెక్, ఈ–లెర్నింగ్, హెల్త్ కేర్, హెచ్ఆర్ టెక్, ఫిన్ టెక్ సెక్టార్లతో పాటు, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఐటీఈఎస్, మాన్యుఫాక్చరింగ్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ), టెలికాం, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్లలో ఫ్రెషర్స్ హైరింగ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
మార్చి నాటికి కరోనా ముందు స్థాయికి..
ఫ్రెషర్స్ డిమాండ్ వచ్చే ఏడాది జనవరి–మార్చి నాటికి కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటుందని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ ఆదిత్య మిశ్రా అన్నారు. ఈ ఏడాది మే–సెప్టెంబర్ మధ్యలో ఉద్యోగాల్లో చేరేందుకు ఆఫర్స్ లెటర్స్ పొందిన వారిలో 65 శాతం మందికి ప్లేస్మెంట్స్ దక్కాయని చెప్పారు. మిగిలిన 35 శాతం మంది మాత్రం ప్లేస్మెంట్స్ పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబర్) ఫ్రెషర్స్ హైరింగ్, గతేడాది ఇదే టైమ్లో జరిగిన ఫ్రెషర్స్ హైరింగ్లో 75 శాతంగా ఉందని చెప్పారు. సాధారణంగా క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఫ్రెషర్స్ను పెద్ద కంపెనీలు నియమించుకుంటాయి. ఈ కంపెనీలు తమ హైరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాడుకొని ఇతర విధానాలలో కూడా ఫ్రెషర్స్ను నియమించుకుంటున్నాయని మిశ్రా చెప్పారు. ఈ కంపెనీలకు ఫ్రెషర్స్ హైరింగ్ కీలకమని అభిప్రాయపడ్డారు. కానీ ఈ ఏడాది ఫ్రెషర్స్కు ఇచ్చే శాలరీలలో 10 శాతం కోత ఉంటుందని అంచనావేశారు. కొత్తగా జాయిన్ అయిన వారికి కంపెనీలు స్కిల్ డెవలప్ మెంట్ ట్రైయినింగ్ ఇస్తున్నాయని మిశ్రా చెప్పారు.
రిమోట్ జాబ్స్కు పెరుగుతున్న ఆదరణ..
తమ సైట్లో ఫ్రెషర్స్ జాబ్ పోస్టింగ్స్ ఈ ఏడాది మార్చి–ఏప్రిల్ నెలల్లో 26 శాతం పడిపోయాయని జాబ్ పోర్టల్ సంస్థ ఇండీడ్ ఇండియా ఎండీ శశి కుమార్ అన్నారు. తీవ్రంగా పడిన ఫ్రెషర్స్ జాబ్ మార్కెట్ ఈ ఏడాది జూన్ తర్వాత నుంచి పుంజుకుందన్నారు. ఈ ఏడాది మే నుంచి జూన్ నాటికి ఫ్రెషర్స్ జాబ్ పోస్టింగ్స్ 57 శాతం పెరిగాయని చెప్పారు. రిమోట్ ఫ్రెషర్ జాబ్స్కు ఈ ఏడాది మే నుంచి డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ఏప్రిల్ నుంచి మే నాటికి రిమోట్ జాబ్ పోస్టింగ్లు 157 శాతం పెరిగాయని అన్నారు. కాగా, ఆఫీస్కు వెలుపల పనిచేసే వారిని రిమోట్ ఎంప్లాయీస్ అంటారు. ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్ట్ టైమ్లో ఫ్రెషర్ జాబ్ పోస్టింగ్స్ కొద్దిగానే పెరిగినప్పటికీ, ఇదే టైమ్లో రిమోట్ ఫ్రెషర్ జాబ్ పోస్టింగ్స్ 364 శాతం పెరిగాయని కుమార్ అన్నారు. దేశంలోని వర్క్ విధానం మారుతోందని పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్, టెక్ సాఫ్ట్వేర్, కస్టమర్ సర్వీసింగ్, మార్కెటింగ్, సేల్స్ రోల్స్కు ఫ్రెషర్స్ను ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పారు.