గెలిస్తేనే నిలిచేది..ఇవాళ వెస్టిండీస్‌‌‌‌తో ఇండియా మూడో టీ20

గెలిస్తేనే నిలిచేది..ఇవాళ వెస్టిండీస్‌‌‌‌తో ఇండియా మూడో టీ20
  • ఒత్తిడిలో  టీమిండియా  టాప్‌‌‌‌  ఆర్డర్‌‌‌‌
  •     సిరీస్‌‌‌‌పై విండీస్‌‌‌‌ దృష్టి 
  •     రా. 8 నుంచి డీడీ స్పోర్ట్స్‌‌‌‌, జియో సినిమాలో లైవ్‌‌‌‌

ప్రావిడెన్స్‌‌‌‌ (గయానా):  వెస్టిండీస్‌‌‌‌ గడ్డపై ఘోరంగా ఫెయిలవుతున్న ఐపీఎల్‌‌‌‌ వీరులకు కఠిన పరీక్ష. ఐదు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన ఇండియా కీలకమైన మూడో మ్యాచ్‌‌‌‌కు రెడీ అయ్యింది. మంగళవారం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లో నెగ్గితేనే సిరీస్‌‌‌‌లో ఆశలు సజీవంగా ఉండే నేపథ్యంలో టీమిండియా టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో అతి కీలకమైన శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఎలా ఆడతారన్న ఉత్కంఠ కూడా మొదలైంది. ఇక లాస్ట్‌‌‌‌ రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొట్టిన విండీస్‌‌‌‌ ప్లేయర్లు ఇక్కడే సిరీస్‌‌‌‌ను పట్టేయాలని చూస్తున్నారు. 

బ్యాటర్లదే బాధ్యత

టీ20ల్లో భారీ హిట్టింగ్‌‌‌‌ చేసే సామర్థ్యం ఉన్న ఇండియా యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ విండీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లపై ఘోరంగా తేలిపోతున్నారు. స్లో పిచ్‌‌‌‌లు కావడంతో అనుకున్న స్థాయిలో షాట్లు కొట్టలేకపోవడం మైనస్‌‌‌‌గా మారింది. దీంతో ఈ మ్యాచ్‌‌‌‌లో బ్యాటర్లందరూ బాధ్యత వహించాల్సిందే. తొలి ఓవర్‌‌‌‌ నుంచే భారీ హిట్టింగ్‌‌‌‌ చేయాలని భావిస్తున్నారు. ఇషాన్‌‌‌‌, గిల్‌‌‌‌, సూర్య మెరుపు ఆరంభాన్నిస్తే భారీ స్కోరు ఆశించొచ్చు. వీళ్లలో ఒకరి ప్లేస్‌‌‌‌లో యశస్వి జైస్వాల్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇస్తారేమో చూడాలి. రెండు మ్యాచ్‌‌‌‌ల్లో మెరిసిన తెలుగు కుర్రాడు తిలక్‌‌‌‌ వర్మ భారీ ఇన్నింగ్స్‌‌‌‌ను ఆశిస్తున్నాడు. మిడిలార్డర్‌‌‌‌లో సంజూ శాంసన్‌‌‌‌ వైఫల్యం టీమ్‌‌‌‌ స్కోరుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం ప్రతికూలంగా మారింది. కనీసం ఈ మ్యాచ్‌‌‌‌లోనైనా ఈ ఇద్దరు బ్యాట్లు ఝుళిపించే ప్రయత్నం చేయాలి. ఈ మ్యాచ్‌‌‌‌ కోసం కొన్ని మార్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బొటన వేలి నొప్పితో రెండో మ్యాచ్‌‌‌‌కు దూరమైన రిస్ట్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఆడతాడో లేదో క్లారిటీ లేదు. చహల్‌‌‌‌, రవి బిష్ణోయ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో పాటు బౌలింగ్‌‌‌‌లోనూ ఫెయిల్​ అవుతున్నారు. పేసర్లు అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, ముకేశ్‌‌‌‌ బాల్‌‌‌‌ను స్వింగ్‌‌‌‌ చేస్తున్నా రన్స్‌‌‌‌ను కట్టడి చేయలేకపోతున్నారు. వీళ్లందరూ సమష్టిగా రాణిస్తేనే ఈ మ్యాచ్‌‌‌‌లో కరీబియన్‌‌‌‌ హిట్టింగ్‌‌‌‌ వీరులకు అడ్డుకట్ట వేయొచ్చు. 

పూరన్‌‌‌‌పైనే భారం

2016 తర్వాత ఇండియాపై విండీస్‌‌‌‌ సిరీస్‌‌‌‌ నెగ్గలేదు. ఇప్పుడు గెలిచే అవకాశం వచ్చింది. దాన్ని ఒడిసిపట్టుకోవాలంటే కరీబి యన్‌‌‌‌ హిట్టర్లు మరోసారి మెరవాలి. ముఖ్యంగా నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌పైనే ఎక్కువ భారం ఉంది. ఓపెనింగ్‌‌‌‌లో బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌, కైల్‌‌‌‌ మేయర్స్‌‌‌‌, జాన్సన్‌‌‌‌ చార్లెస్‌‌‌‌ కూడా రాణిస్తే విండీస్‌‌‌‌ విజయం మరింత ఈజీ కానుంది. పావెల్‌‌‌‌, హెట్‌‌‌‌మయర్‌‌‌‌ చెలరేగితే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌‌‌‌లో విండీస్‌‌‌‌కు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. జేసన్‌‌‌‌ హోల్డర్‌‌‌‌, అకీల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌, అల్జారీ జోసెఫ్‌‌‌‌, ఫెపర్డ్‌‌‌‌ అనుకున్న స్థాయిలో ఇండియాను కట్టడి చేస్తున్నారు. ఓవరాల్‌‌‌‌గా టీమ్‌‌‌‌లో ఎలాంటి మార్పులు చేయకుండా సిరీస్‌‌‌‌ను పట్టేయాలన్న లక్ష్యంతో విండీస్​ బరిలోకి దిగుతున్నది.

ఇండియా: హార్దిక్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ / యశస్వి జైస్వాల్‌‌‌‌, గిల్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌, తిలక్‌‌‌‌ వర్మ, శాంసన్‌‌‌‌,  అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, చహల్‌‌‌‌, ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌. 
వెస్టిండీస్‌‌‌‌: పావెల్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌, కైల్‌‌‌‌ మేయర్స్‌‌‌‌, జాన్సన్‌‌‌‌ చార్లెస్‌‌‌‌, నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌, హెట్‌‌‌‌మయర్‌‌‌‌, రొమారియో ఫెపర్డ్‌‌‌‌, జేసన్‌‌‌‌ హోల్డర్‌‌‌‌, అకీల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌, అల్జారీ జోసెఫ్‌‌‌‌, ఒబేద్‌‌‌‌ మెకాయ్‌‌‌‌.