ముంబై: ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్ (క్యూ4)లో ఇండియా కరెంట్ అకౌంట్ మిగులు 7.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.67,868 కోట్లు) చేరుకుంది. ఆర్బీఐ డేటా ప్రకారం, ఇది జీడీపీలో 0.7 శాతానికి సమానం.
ఒక నిర్ధిష్ట కాలంలో విదేశాల నుంచి మన దేశంలోకి వచ్చిన డబ్బు, మనం విదేశాలకు చెల్లించిన డబ్బు కంటే ఎక్కువగా ఉంటే దానిని 'మిగులు' అంటారు. సాఫ్ట్వేర్ ఎగుమతులు పెరగడంతో క్యూ4లో కరెంట్ అకౌంట్ మిగులు సాధించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలోని క్యూ4లో ఈ మిగులు 13.7 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.4 శాతం) గా ఉంది.
క్యూ4లో మిగులు సాధించినప్పటికీ, పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2025–-26) గాను కరెంట్ అకౌంట్ లోటు 25.2 బిలియన్ డాలర్లు (జీడీపీలో 0.6 శాతం)గా నమోదైంది. 2024-25లో ఇది 22.9 బిలియన్ డాలర్లు (జీడీపీలో 0.6 శాతం) గా ఉంది. సేవల రంగంలో క్యూ4లో ఇండియాకు వచ్చిన నెట్ సర్వీస్ రిసీట్స్ 60.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏడాది లెక్కన 53.3 బిలియన్ డాలర్ల నుంచి పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
