
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో ఇండియా ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ రంగంలో దేశానికి మంచి భవిష్యత్తు ఉందని, శిక్షణ పొందిన నిపుణులు ఉన్నారని చెప్పారు. దేశంలో అన్ని పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. దేశంలో తయారవుతున్న వాహనాల నాణ్యత బాగుందని, ఖర్చు తక్కువని మంత్రి చెప్పారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.22 లక్షల కోట్లు ఉంది. అమెరికాలో రూ.78 లక్షల కోట్లు, చైనాలో రూ.47 లక్షల కోట్లు ఉంది.
పెట్రోల్, డీజిల్వంటి శిలాజ ఇంధనాల దిగుమతి కోసం దేశం ఏటా రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. వీటివల్ల కాలుష్య సమస్య ఎదురవుతోంది. భారతీయ కంపెనీలు తయారుచేస్తున్న ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులు చాలా తక్కువ ధరకే వస్తున్నాయి. లిథియం -అయాన్ బ్యాటరీల ధర కూడా తగ్గుతోంది’’అని గడ్కరీ అన్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల ధర, ఎలక్ట్రిక్ వాహనాల ధర ఒకేలా ఉంటాయని మంత్రి చెప్పారు.
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 60 వేల వరకు ఉందని, కానీ దేశానికి లక్ష బస్సుల వరకు అవసరమని పేర్కొన్నారు. ఈవీ కంపెనీలకు ఇది మంచి అవకాశం అని, ఎగుమతికి కూడా పెద్ద మార్కెట్ ఉందని గడ్కరీ అన్నారు. పాత వాహనాలను స్క్రాప్ చేయడం ద్వారా మంచి మెటీరియల్లభిస్తుందని, దానిని 100 శాతం రీసైకిల్ చేయవచ్చని గడ్కరీ చెప్పారు. డీలర్లు స్క్రాపేజీని ఒక అవకాశంగా చూడాలని మంత్రి సూచించారు.