మౌంట్ మాంగనుయ్: టీ20 ఫార్మాట్లో తనకు ఎదురేలేదని వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి చాటి చెప్పాడు. మరో సెన్సేషనల్ ఇన్నింగ్స్తో ఇండియా టీమ్లో సుప్రీమ్ స్టార్ను తానే అని నిరూపించుకున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన ఖతర్నాక్ షాట్లతో ఫ్యాన్స్కు కిక్ ఇస్తూ.. న్యూజిలాండ్ బౌలర్లకు పీడకల మిగిల్చాడు. సూర్య (51 బాల్స్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 111 నాటౌట్) కెరీర్లో సెంచరీతో చెలరేగిన వేళ ఆదివారం జరిగిన రెండో టీ20లో ఇండియా 65 రన్స్ తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో లీడ్ సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఇండియా 20 ఓవర్లలో 191/6 స్కోరు చేసింది. సూర్యకు తోడు యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (31 బాల్స్లో 5ఫోర్లు, 1 సిక్స్ తో 36) ఆకట్టుకున్నాడు. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా (13), దీపక్ హుడా (0), సుందర్ (0) ను వరుస బాల్స్లో ఔట్ చేసిన కివీస్ పేసర్ టిమ్ సౌథీ (3/34) హ్యాట్రిక్ సాధించాడు. అనంతరం ఛేజింగ్లో కివీస్ 18.5 ఓవర్లలో 126 రన్స్కే ఆలౌటైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61) ఒంటరి పోరాటం చేశాడు. ఇండియా బౌలర్లలో పార్ట్ టైమర్ దీపక్ హుడా (4/10) నాలుగు వికెట్లతో దెబ్బకొట్టాడు. సిరాజ్(2/24), చహల్ 2/26) చెరో రెండు వికెట్లు తీశారు. సూర్యకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 వర్షం రద్దయిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ మంగళవారం నేపియర్లో జరుగుతుంది.
వన్డౌన్లో వచ్చి విధ్వంసం
వన్డౌన్లో వచ్చిన సూర్యకుమర్ ఇండియా ఇన్నింగ్స్లో హీరోగా నిలిచాడు. తన మెరుపుల వల్లే జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఓపెనర్గా వవ్చిన రిషబ్ పంత్ (13 బాల్స్లో 6) ఫెయిలైనా మరో ఓపెనర్ ఇషాన్ బాగానే ఆటడంతో పవర్ ప్లేలో ఇండియా 42/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్లో వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. తిరిగి మొదలైన తర్వాత సూర్యకుమార్ షో మొదలైంది. పదో ఓవర్లో ఇషాన్ను సోధీ వెనక్కిపంపగా.. శ్రేయస్ అయ్యర్ (13) హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అయితే, సోధీ వేసిన 12వ ఓవర్లో 4,6తో సూర్య గేరు మార్చాడు. వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. 32 బాల్స్లో ఫిఫ్టీ కొట్టిన అతను తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సౌథీ వేసిన 17వ ఓవర్లో 6, 4,4 కొట్టిన అతను మిల్నే బౌలింగ్లో రెండు క్లాసిక్ సిక్సర్లు రాబట్టాడు. ఇక, ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో విజృంభించి 49 బాల్స్లోనే సెంచరీ అందుకున్నాడు. తన జోరు చూస్తుంటే ఇండియా ఈజీగా 200 మార్కు దాటాల్సింది. అయితే, చివరి ఓవర్లో పాండ్యా, దీపక్ హుడా, సుందర్లను ఔట్ చేసిన సౌథీ హ్యాట్రిక్ తీయగా.. సూర్యకు స్ట్రయిక్ రాలేదు.
కివీస్ ఢమాల్
భారీ టార్గెట్ ఛేజింగ్లో న్యూజిలాండ్ ఏ దశలోనూ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఇన్నింగ్స్ రెండో బాల్కే ఓపెనర్ ఫిన్ అలెన్ (0)ను వెనక్కుపంపిన భువనేశ్వర్ ఆ టీమ్కు షాకిచ్చాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (25), కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో వికెట్కు 56 రన్స్ జోడించి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ, తొమ్మిదో ఓవర్లో కాన్వేను ఔట్ చేసిసుందర్ ఈ జోడీని విడదీయగా.. తర్వాతి ఓవర్లోనే ప్రమాదకర గ్లెన్ ఫిలిప్స్ (12)ను చహల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో, కివీస్ డిఫెన్స్లో పడిపోయింది. ఓ ఎండ్లో కెప్టెన్ కేన్ పాతుకుపోయినా.. మరో ఎండ్ల వరుసగా వికెట్లు పడగొట్టిన ఇండియా బౌలర్లు.. ప్రత్యర్థిని దెబ్బమీద దెబ్బకొట్టారు. డారిల్ మిచెల్ (10)ను హుడా, జేమ్స్ నీషమ్ (0)ను చహల్ వెనక్కుపంపగా.. శాంట్నర్ (2), విలియమ్సన్ను వరుస ఓవర్లలో ఔట్ చేసిన సిరాజ్ ఇండియా విజయం ఖాయం చేశాడు. హుడా దెబ్బకు టెయిలెండర్లు కూడా పెవిలియన్కు క్యూ కట్టడంతో ఇండియా భారీ విజయం సొంతం చేసుకుంది.
3 రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత ఈ ఫార్మాట్ లో రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఇండియా మూడో క్రికెటర్గా సూర్య నిలిచాడు. రోహిత్ ఖాతాలో నాలుగు సెంచరీలు ఉండగా.. కేఎల్ రాహుల్ రెండు సాధించాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 191/6 (సూర్య 111 నాటౌట్, ఇషాన్ 36, సౌథీ 3/34)
న్యూజిలాండ్: 18.5 ఓవర్లలో 126 ఆలౌట్ (విలియమ్సన్ 61, హుడా 4/10)