
బాకు (అజర్బైజాన్): ఇండియా యంగ్ షూటర్, హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ మరోసారి తన ‘స్వర్ణగురి’తో మెరిసింది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఇండియా షూటర్ శివ నర్వాల్తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆమె చాంపియన్గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇషా–నర్వాల్ జంట 16–10తో ఇలైదా టర్హాన్–యూసుఫ్ డికెక్ (టర్కీ)పై గెలిచింది. క్వాలిఫికేషన్ రౌండ్లో అద్భుతమైన గురితో ఆకట్టుకున్న ఇషా (290), నర్వాల్ (293) మొత్తం 583 పాయింట్లతో టాప్ ప్లేస్తో ఫైనల్కు వచ్చారు. టర్కీ షూటర్లు 581 పాయింట్లతో రెండో ప్లేస్లో నిలిచి గోల్డ్ మెడల్ మ్యాచ్కు అర్హత సాధించారు. స్వర్ణ పోరులో టర్కీ షూటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇషా, శివ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ టార్గెట్గా దూసుకెళ్తున్న ఇషా వ్యక్తిగత ఈవెంట్లో నిరాశ పరిచినా మిక్స్డ్లో మెప్పించి పోడియంపై నిలుచుంది. ఈ విజయంతో ఆమె పట్టరాని సంతోషంలో ఉంది. ‘మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వరల్డ్ చాంపియన్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’ అని ఇషా చెప్పింది.
ఎయిర్ రైఫిల్ లో ఇండియాకు నిరాశ
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇండియా క్వాలిఫికేషన్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. 630.2 పాయింట్లతో మెహులీ ఘోష్– ప్రతాప్ సింగ్ 9వ స్థానంలో నిలవగా, 628.3 పాయింట్లతో రమితా– దివ్యాన్షు సింగ్ పన్వర్.. 17వ ప్లేస్తో సరిపెట్టుకున్నారు. విమెన్స్ స్కీట్ టీమ్ 351 పాయింట్లతో నాలుగో ప్లేస్తో కొద్దిలో మెడల్ కోల్పోయింది.