
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఇండియా ఆయిల్, వెపన్స్ కొనుగోలుపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో ఈ విషయంలో తమ ఇంధన అవసరాలను బట్టే నిర్ణయాలు ఉంటాయని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికాతో సంబంధాలు, ట్రంప్ టారిఫ్ల అంశంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.
‘‘మా ఇంధన అవసరాలను తీర్చుకునే విషయంలో దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లో లభించే ఆఫర్ను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం” అని ఆయన తేల్చి చెప్పారు. అయితే, అమెరికా, భారత్ సంబంధాలు ఎన్నో సవాళ్లను, మార్పులను దాటుకుని వచ్చాయని జైస్వాల్ అన్నారు.
మాపై అమెరికాది బ్యాలెన్స్డ్ టారిఫ్.. మా ఎకానమీ బలోపేతం అవుతుంది: పాక్
తమ దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 19 శాతం టారిఫ్ బ్యాలెన్స్డ్గా ఉందని, తాజా సుంకాలతో తమ ఎకానమీ బలోపేతం అవుతుందని పాకిస్తాన్ పేర్కొంది. యూఎస్ విధించిన సుంకాలు ఆశాజనకంగా ఉన్నాయని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఇంతకుముందు 29% ఉన్న టారిఫ్లను ట్రంప్ తాజాగా 19 శాతానికి తగ్గించారని, దీనిని స్వాగతిస్తున్నామని వెల్లడించింది.
‘‘ఇకపై అమెరికా మార్కెట్లోకి ఎగుమతి అయ్యే పాకిస్తాన్ వస్తువులకు 19% టారిఫ్ వర్తిస్తుంది. ఈ టారిఫ్తో సౌత్, ఆగ్నేయాసియా దేశాలకు పాక్ మరింత పోటీ ఇస్తుంది. అమెరికాకు మా దేశ ఎగుమతులు పెరుగుతాయి. మా దేశ ఎకానమీకి వెన్నెముక అయిన టెక్స్ టైల్స్ వంటి కీలక రంగంలో ఎక్స్పోర్టులు పెరిగి మా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది” అని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది.