ఇండియా ఎవరికీ తలవంచదు..అమెరికా డిమాండ్లను మోదీ కేర్ చేయరు: పుతిన్

ఇండియా ఎవరికీ తలవంచదు..అమెరికా డిమాండ్లను మోదీ  కేర్ చేయరు: పుతిన్
  • మోదీ తెలివైన, బ్యాలెన్స్​డ్  లీడరని ప్రశంసలు
  • రష్యా, భారత్​ది ప్రత్యేక బంధమని వెల్లడి

మాస్కో: రష్యా నుంచి క్రూడాయిల్  కొనకుండా భారత్​పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా డిమాండ్లను ఇండియా కేర్  చేయదని, ఎవ్వరి ముందూ తల వంచదని అన్నారు. రష్యాలోని సోచిలో జరుగుతున్న వల్దాయ్  డిస్కషన్  క్లబ్  ప్లీనరీ సెషన్​లో పుతిన్  మాట్లాడారు. రష్యా, భారత్​ది బలమైన బంధమని పేర్కొన్నారు. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలివైన, బ్యాలెన్స్​డ్  లీడర్  అని కొనియాడారు. ‘‘రష్యా నుంచి క్రూడాయిల్  కొనాలన్న భారత నిర్ణయం పూర్తిగా ఆ దేశ ఆర్థిక వ్యవహారానికి సంబంధించినది. ఆ విషయంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశంలేదు. మా దగ్గర ఇంధనం కొనకుంటే ఇండియా నష్టపోతుంది. దాదాపు రూ.80 లక్షల కోట్ల నష్టం రావచ్చని అంచనా. 

రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటే ఇండియాపై ఆంక్షలు విధిస్తారు. అప్పుడు కూడా నష్టాలు ఒకేవిధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో దిగుమతులు ఆపడం ఎందుకు?” అని పుతిన్  వ్యాఖ్యానించారు. అమెరికా టారిఫ్​ల వల్ల భారత్​కు నష్టాలు వస్తున్నాయని, తమ దేశం నుంచి క్రూడాయిల్​ను దిగుమతి చేసుకోవడం ద్వారా ఆ నష్టాలను ఇండియా భర్తీ చేసుకుంటుందన్నారు. 

అమెరికా టారిఫ్​లతో అంతర్జాతీయంగా ధరలు పెరిగే అవకాశం ఉందని, యూఎస్  ఫెడరల్  రిజర్వ్  వడ్డీ రేట్లను పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, సోవియట్  యూనియన్  కాలం నుంచి భారత్, రష్యా మధ్య స్నేహం ఉందని పుతిన్ తెలిపారు. భారత్​తో తమకెప్పుడూ సమస్యలు ఏర్పడలేదని, టెన్షన్లు లేవన్నారు. నరేంద్ర మోదీ తన స్నేహితుడన్నారు. మోదీతో మాట్లాడేటపుడు తనకు ఎంతో సౌకర్యంగా అనిపిస్తుందని చెప్పారు.