- టీమిండియా తుది జట్టులో పంత్, జురెల్కు ప్లేస్ ఖాయం
- సౌతాఫ్రికాతో తొలి టెస్ట్కు..
- నితీశ్ కుమార్కు నో చాన్స్
కోల్కతా: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్కు టీమిండియా తుది జట్టు దాదాపుగా ఖరారైంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్తో పాటు ధ్రువ్ జురెల్ కూడా ఫైనల్ ఎలెవన్లో ఉంటాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కెట్ బుధవారం స్పష్టం చేశాడు. అయితే ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ప్లేస్లో జురెల్ తుది జట్టులోకి వస్తాడని చెప్పాడు. జులైలో మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్ట్లో తగిలిన పాదం గాయం నుంచి పంత్ పూర్తిగా కోలుకుని ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయినా జురెల్కు మేనేజ్మెంట్ చోటు కల్పిస్తుందా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇటీవల జురెల్ ఫామ్ను దృష్టిలో పెట్టుకుని స్పెషలిస్ట్ బ్యాటర్గా అతన్ని తుది జట్టులోకి తీసుకోనున్నారు. ‘ఈడెన్ గార్డెన్స్లో జరిగే తొలి టెస్ట్కు సంబంధించిన తుది జట్టుపై మేం స్పష్టంగా ఉన్నాం. పంత్, జురెల్ ఇద్దరూ ఆడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లలో ఎవర్నీ తప్పించలేం. వాళ్లిద్దరు ఆడటమే కరెక్ట్’ అని డస్కెట్ పేర్కొన్నాడు.
కీపింగ్ బాధ్యతలు పంత్కే..
ఈ సిరీస్లో కీపింగ్ బాధ్యతలు పంత్కే ఉంటాయని డస్కెట్ స్పష్టం చేశాడు. అయితే ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి ప్లేస్లో జురెల్ పూర్తి స్థాయి బ్యాటర్గా తుది జట్టులోకి వస్తాడన్నాడు. ‘వెస్టిండీస్తో సిరీస్లో నితీశ్ రెండు టెస్ట్లు ఆడాడు. ఫ్యూచర్ కోసం అతన్ని మరింతగా తీర్చిదిద్దేందుకు సమయం ఇస్తున్నాం. నితీశ్ ఇంకా నేర్చుకునే స్థాయిలోనే ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే ప్రతి ఒక్కరికి గెలుపు ముఖ్యం. అందుకే మా స్ట్రాటజీల ప్రకారం ముందుకెళ్తాం. కుర్రాళ్ల అభివృద్ధి కోసం కొంత సమయం ఇవ్వడంలో తప్పులేదు. నితీశ్ విషయంలో మా వైఖరి మారలేదు. అతనికి ఆసీస్లో ఎక్కువగా ఆడే చాన్స్ రాలేదు. కానీ ఈ సిరీస్ ప్రాముఖ్యత, మేం ఎదుర్కోబోయే పరిస్థితులను బట్టి నితీశ్కు తుది జట్టులో చోటు కష్టంగా మారింది’ అని డస్కెట్ వివరించాడు. నితీశ్రెడ్డిని టీమిండియా నుంచి రిలీజ్ చేసి ఇండియా–ఎ జట్టులో చేర్చారు. సౌతాఫ్రికా–ఎతో జరిగే వన్డే సిరీస్లో అతను ఆడనున్నాడు.
స్పిన్ ఆల్రౌండర్లు సూపర్
లోయర్ మిడిలార్డర్లో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అద్భుతంగా ఆడుతున్నారని డస్కెట్ కితాబిచ్చాడు. లైనప్లో బ్యాటింగ్ డెప్త్ పెరగడానికి వీళ్లు చాలా సహాయపడుతున్నారన్నాడు. ‘జడేజా, సుందర్, అక్షర్ పటేల్ రాకతో లోయర్ మిడిలార్డర్ మరింత బలంగా తయారైంది. వీళ్లు ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్లు అయినా పర్ఫెక్ట్ బ్యాటర్లుగా ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఇది మా లైనప్ డెప్త్ను తెలుపుతుంది. సౌతాఫ్రికాలాంటి జట్టుపై ఇలాంటి లైనప్ కచ్చితంగా అవసరం. కుల్దీప్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పరిస్థితులను బట్టి తర్వాత అవకాశాలు రావొచ్చు’ అని డస్కెట్ చెప్పుకొచ్చాడు.
నాలుగు సెంచరీలు..
ఇప్పటి వరకు ఏడు టెస్ట్ మ్యాచ్ (430 రన్స్)లు ఆడిన 24 ఏళ్ల జురెల్ తన చివరి ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. వాటిలో గతవారం బెంగళూరులో సౌతాఫ్రికా–ఎతో జరిగిన మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకాలు బాదాడు. ఏడాదిన్నర కిందట ఇంటర్నేషనల్ కెరీర్ మొదలుపెట్టిన జురెల్ అనుభవంతోపాటు మంచి సమతుల్యతను, పరిణతిని ప్రదర్శిస్తున్నాడు. సెప్టెంబర్ 2025 మధ్య నుంచి ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో అతను (రంజీ, టెస్ట్, సౌతాఫ్రికా–ఎతో) 140, 56, 125, 44, 132*, 127* స్కోర్లు చేశాడు. సగటు 47.34 నుంచి 58కి పెరిగింది. బ్యాటింగ్ ఇంత అద్భుతంగా ఉండటంతో జురెల్ను పక్కనబెట్టడం మేనేజ్మెంట్కు అసాధ్యంగా మారింది. ‘గత ఆరు నెలల్లో జురెల్ ఆట తీరును చూస్తే చాలా మార్పు కనిపిస్తుంది. బెంగళూరులో సౌతాఫ్రికా–ఎపై చేసిన రెండు సెంచరీలు చూస్తే అతను తుది జట్టులో ఉండటం కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి తొలి టెస్ట్లో అతను ఆడటం ఖాయం’ అని డస్కెట్ వెల్లడించాడు.
