
సింగపూర్: ఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఇండియా ఫుట్బాల్ టీమ్ కీలక సవాల్కు సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 09) జరిగే మూడో రౌండ్ మ్యాచ్లో సింగపూర్తో పోటీపడనుంది. సరైన ప్రిపరేషన్ లేకుండానే ఇండియా ఈ పోరుకు రెడీ అయింది. ఈ మ్యాచ్కు ముందు ఏర్పాటు చేసిన నేషనల్ క్యాంప్ మొదటి భాగంలో చాలా మంది కీలక ప్లేయర్లు గైర్హాజరయ్యారు.
దాంతో జట్టంతా కలిసి వారం మాత్రమే ప్రాక్టీస్ చేసింది. సీఏఎఫ్ఏ నేషన్స్ కప్లో ఆడకుండా రెస్ట్ తీసుకున్న లెజెండరీ సునీల్ ఛెత్రి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఖలీద్ జమీల్ కోచింగ్లోని ఇండియా ఆసియా కప్ క్వాలిఫయింగ్ తొలి రెండు మ్యాచ్ల్లో ఒకే ఒక్క పాయింట్ సాధించింది. బంగ్లాదేశ్తో తొలి పోరును 0–0తో డ్రా చేసుకున్న జట్టు.. హాంకాంగ్ చేతిలో 0–-1తేడాతో ఓడిపోయింది.
గ్రూప్–సిలో ఇండియా ఒకే పాయింట్తో ఆఖరి స్థానంలో ఉండగా.. నాలుగు పాయింట్లతో సింగపూర్ గ్రూప్ టాపర్గా ఉంది. దాంతో ఈ పోరులో ఇండియాకు ఆతిథ్య జట్టుకు కఠిన సవాల్ ఎదురవనుంది. ఈ మ్యాచ్లో ఏ చిన్న పొరపాటు జరిగినా 2027 మెయిన్ టోర్నమెంట్కు అర్హత సాధించే ఇండియా అవకాశాలు దెబ్బతినే చాన్సుంది.
ఎందుకంటే గ్రూప్ టాపర్ మాత్రమే మెయిన్ ఈవెంట్కు డైరెక్ట్ క్వాలిఫై అవుతుంది. ఈ మ్యాచ్ తర్వాత ఈ నెల14న గోవాలో జరిగే హోమ్ లెగ్ మ్యాచ్లో ఇండియా మరోసారి సింగపూర్తో తలపడుతుంది.