క్రాస్ ఓవర్ మ్యాచ్లో అనూహ్య ఓటమి
సడెన్ డెత్లో గెలిచిన న్యూజిలాండ్
క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశం
భువనేశ్వర్ : సొంతగడ్డపై హాకీ వరల్డ్కప్లో ఇండియాకు షాక్ తగిలింది. క్వార్టర్స్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన క్రాస్ ఓవర్ మ్యాచ్లో ఓ దశలో 2-–0తో ఆధిక్యంలో నిలిచిన హోమ్టీమ్ చేజేతులా ఓడిపోయింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ‘సడెన్ డెత్’లో ఇండియాపై విజయం సాధించి క్వార్టర్స్కు చేరుకుంది. ఫలితంగా 48 ఏళ్ల తర్వాత వరల్డ్కప్ గెలవాలన్న టీమిండియాకు చుక్కెదురైంది. రెగ్యులర్ టైమ్ను ఇరుజట్లు 3–3 స్కోరుతో ముగించాయి. ఇండియా తరఫున లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (17వ ని.), సుఖ్జిత్ సింగ్ (24వ ని.), వరుణ్ కుమార్ (40వ ని.) గోల్స్ చేయగా, లాన్ సామ్ (28వ ని.), కేన్ రస్సెల్ (43వ ని.), ఫిండ్లే సీన్ (49వ ని.) కివీస్కు గోల్స్ అందించారు. తొలి హాఫ్ ముగిసే సమయానికి ఇండియా 2–0 లీడ్లో ఉన్నా.. ఆ తర్వాత డిఫెన్స్ ఫెయిల్యూర్తో కివీస్కు పుంజుకునే చాన్స్ ఇచ్చింది. మ్యాచ్ మొత్తంలో ఇండియాకు 11 పెనాల్టీలు లభించగా, రెండింటిని మాత్రమే గోల్స్గా మలిచింది. కివీస్కు రెండు చాన్స్లు మాత్రమే వచ్చాయి. చాలాసార్లు గోల్ కొట్టే చాన్స్ వచ్చినా.. ఇండియా ఫార్వర్డ్స్ సరైన ఫినిషింగ్ను చూపలేకపోయారు. సెకండ్ హాఫ్లో గొప్పగా పుంజుకున్న కివీస్.. వచ్చిన చాన్స్లను అద్భుతంగా ఉపయోగించుకుంది. వరుస విరామాల్లో గోల్స్ కొట్టి స్కోరు సమం చేయడంతో షూటౌట్ అనివార్యమైంది.
శ్రీజేష్కు గాయం.. ఇండియాకు దెబ్బ
ఐదు సెట్ల పెనాల్టీ షూటౌట్లో 2–3తో వెనుకబడిన ఇండియాను గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ ఆదుకున్నాడు. న్యూజిలాండ్ చివరి రెండు ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకోవడంతో పాటు సడెన్ డెత్లోనూ ఓ గోల్ను ఆపి ఇండియాను ఆదుకున్నాడు. షూటౌట్లో ఇండియా తరఫున హర్మన్ప్రీత్, రాజ్కుమార్, సుఖ్జిత్ గోల్స్ చేయగా, షంషేర్, అభిషేక్ ఫెయిలయ్యారు. కివీస్ ప్లేయర్లలో నిక్ వుడ్స్, ఫిండ్లే సీన్, ఫిలిప్స్ హైడెన్స్ గోల్ చేయగా, సామ్ హిహా, సామ్ లేన్ ప్రయత్నాలను శ్రీజేష్ నిలువరించాడు. ఇక సడెన్ డెత్ తొలి రౌండ్లో కివీస్ ప్లేయర్ నిక్ వుడ్స్ కొట్టిన ప్రయత్నాన్ని శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఈ టైమ్లో హర్మన్ గోల్ కొడితే ఇండియా గెలిచేది. కానీ అతను కొట్టిన బాల్ను కివీస్ కీపర్ నిలువరించాడు. ఇదే టైమ్లో శ్రీజేష్ మోకాలి గాయంతో బయటకు వెళ్లడం ఇండియాను దెబ్బతీసింది. అతని ప్లేస్లో వచ్చిన కృషన్ పాథక్ ఫెయిలయ్యాడు. రెండో రౌండ్లో సుఖ్జిత్, హైడెన్ విఫలం కాగా, థర్డ్ రౌండ్లో షంషేర్ టార్గెట్ను మిస్సయ్యాడు. కానీ సామ్ లేన్ సక్సెస్ అవడంతో కివీస్ విజయం ఖాయమైంది. మరో మ్యాచ్లో స్పెయిన్ 4–3 (పెనాల్టీ షూటౌట్)తో మలేసియాను ఓడించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. రెగ్యులర్ టైమ్లో ఇరుజట్లు 2–2 స్కోరు చేయడంతో షూటౌట్ను నిర్వహించారు.