న్యూఢిల్లీ : అధిక ఆహార ఇన్ఫ్లేషన్ (ధరల పెరుగుదల), బలహీన ఎగుమతుల వంటి అడ్డంకులను సమర్థంగా ఎదుర్కొంటున్న భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి సాధించవచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సోమవారం ప్రకటించింది. ఈసారి మనదేశం ఆరు శాతం గ్రోత్ సాధిస్తుందని ఈ సంస్థ గతంలో ప్రకటించగా, ప్రస్తుతం దానిని పెంచింది. రాబోయే ఆర్థిక సంవత్సరం (2024-–25) వృద్ధి అంచనాలను 6.9 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. హయ్యర్ బేస్ వల్ల వృద్ధి తగ్గుదల, గ్లోబల్ గ్రోత్ నెమ్మదించడం, వడ్డీ రేట్ల ప్రభావం ఇందుకు కారణాలని పేర్కొంది. ఎస్ అండ్ పీ అంచనాలు ఇతర అంతర్జాతీయ ఏజెన్సీల కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.3 శాతం వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, ఫిచ్ అంచనా వేస్తున్నాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. మార్చి 2023తో ముగిసిన 2022–-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి చెందింది. మార్చి క్వార్టర్లో 6.1 శాతంగా ఉన్న దేశ వాస్తవ జీడీపీ జూన్ క్వార్టర్లో వార్షిక ప్రాతిపదికన 7.8 శాతం పెరిగింది. ఇన్ఫ్లేషన్ను తగ్గించడానికి ఆర్బీఐ గత ఏడాది మే నుంచి బెంచ్మార్క్ వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఫిబ్రవరి నుంచి రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది.
అధిక డిమాండ్ కారణంగా భారతదేశం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఆర్థిక వ్యవస్థలలో ఈ సంవత్సరం, తదుపరి సంవత్సరం వృద్ధి పటిష్టంగా ఉంటుందని ఎస్ అండ్పీ తన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ ఔట్లుక్లో పేర్కొంది. దీని ప్రకారం.. భారతదేశంలో ప్రైవేట్ వినియోగదారుల ఖర్చు కంటే స్థిర పెట్టుబడులు వేగంగా పుంజుకున్నాయి. మనదేశంలో -సెప్టెంబర్ క్వార్టర్లో ఆహార ఇన్ఫ్లేషన్లో తాత్కాలిక పెరుగుదల ఉంది. ఇప్పటికీ, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉంది.