
ముంబై: అధికారిక డేటా చెబుతున్న దానికంటే వేగంగా ఇండియా ఎదుగుతోందని క్రెడిట్ సూజ్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియాలోని కంపెనీల ఈక్విటీ షేర్ల అవుట్లుక్ అప్గ్రేడ్ కావాల్సి ఉందని పేర్కొంది. గతంలోని అండర్వెయిట్ కేటగిరీ నుంచి మన దేశపు కంపెనీల ఈక్విటీ షేర్లకు అవుట్లుక్ను బెంచ్మార్క్కు అప్గ్రేడ్ చేశామని వెల్లడించింది. బెంచ్మార్క్ ఇండెక్స్లు మరో 14 శాతం దాకా పెరగడానికి ఛాన్స్ ఉందని వివరించింది. 2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా 7 శాతం గ్రోత్సాధిస్తుందని క్రెడిట్ సూజ్ రీసెర్చ్ హెడ్ నీల్కాంత్ మిశ్రా చెప్పారు. ఇండియా గ్రోత్ 6 శాతానికే పరిమితమవుతుందని చాలా మంది అంచనాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారిక డేటాను తీసుకునే చాలా మంది తమ అంచనాలు రూపొందించారని, తాము మాత్రం మరింత లోతుగా డేటాను విశ్లేషించి ఈ నిర్ణయానికి వచ్చామని మిశ్రా చెప్పారు.
డెన్స్ ఫ్యూయెల్స్ గ్రోత్ తీసుకుంటే గత మూడేళ్లలో 4 శాతం పెరిగిందని, అలాగే బీఎస్ఈ 500 కంపెనీల రెవెన్యూ గ్రోత్ కూడా వృద్ధి వేగమవుతుందనే సూచిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని చాలా అంశాల కారణంగా ఇండియా జీడీపీ గ్రోత్ 2023 లో పటిష్టంగా ఉంటుందని మిశ్రా చెప్పారు. ప్రభుత్వ ఖర్చు పెరగడంతోపాటు, తక్కువ జీతాల ఉద్యోగాలూ పెరిగాయని అన్నారు. ఎనర్జీ కోసం దిగుమతులపై ఆధారపడటంతోపాటే, గ్రోత్ కోసం విదేశీ పెట్టుబడుల వైపే చూడటం వంటివి ఇండియాకున్న రిస్క్ ఫ్యాక్టర్లని మిశ్రా వెల్లడించారు.