న్యూఢిల్లీ: మనదేశం ఈ ఏడాది అక్టోబర్లో డై–యూరియా అమోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) సహా 23.4 లక్షల టన్నుల ఎరువులను దిగుమతి చేసుకుందని కేంద్రం ప్రకటించింది. మొత్తం ఎరువుల దిగుమతులలో, డీఏపీ గరిష్టంగా 14.70 లక్షల టన్నులు, యూరియా 4.60 లక్షల టన్నులు, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపి) 2.36 లక్షల టన్నులు, కాంప్లెక్స్లు 1.70 లక్షల టన్నులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, దేశీయ ఎరువుల ఉత్పత్తి అక్టోబర్లో 36.19 లక్షల టన్నులుగా రికార్డయింది.
టార్గెట్ 41.54 లక్షల టన్నుల కంటే ఇది తక్కువే. ఈ ఏడాది అక్టోబరులో 71.47 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేయగా, ఉత్పత్తి 64.28 లక్షల టన్నులు మాత్రమే ఉంది. ఇదే కాలంలో 53.34 లక్షల టన్నులు అమ్ముడయ్యాయి. యూరియా అమ్మోనియా మినహా, డీఏపీ ఎరువుల ధరలు అక్టోబర్లో గ్లోబల్ మార్కెట్లో గత సంవత్సరంతో పోల్చితే పెరిగాయి. ప్రభుత్వం టన్ను యూరియాకు రూ.5,360 చొప్పున సబ్సిడీని అందిస్తోంది.