నవీ ముంబై: ఇండియా విమెన్స్కు మళ్లీ నిరాశే. సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో మరో సిరీస్లోనూ హర్మన్సేన ఓడింది. బౌలింగ్లో సదర్లాండ్ (2/12), బ్యాటింగ్లో ఓపెనర్లు అలీసా హీలీ (38 బాల్స్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 55), బెత్ మూనీ (45 బాల్స్లో 5 ఫోర్లతో 52 నాటౌట్) విజృంభించడంతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది.
దాంతో సిరీస్ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 147/6 స్కోరు చేసింది. రిచా ఘోష్ (28 బాల్స్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34), స్మృతి మంధాన (28 బాల్స్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 29), షెఫాలీ వర్మ (17 బాల్స్లో 6 ఫోర్లతో 26) రాణించారు. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్, జార్జియా వారెహమ్ (2/24) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్లో ఆసీస్ 18.4 ఓవర్లలోనే 149/3 స్కోరు చేసి గెలిచింది. పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు పడగొట్టింది. సదర్లాండ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, హీలీకి ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు లభించాయి.
ఆదుకున్న రిచా
గత పోరులో ఫెయిలైన ఓపెనర్లు షెఫాలీ, మంధాన ఈసారి మంచి ఆరంభమే ఇచ్చినా తర్వాత ఇండియా తడబడింది. మిడిలార్డర్లో రిచా ఘోష్ ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. ఆరంభంలో మాత్రం యంగ్ స్టర్ షెఫాలీ వరుస బౌండ్రీలతో హోరెత్తించింది. ఇన్నింగ్స్ ఐదో బాల్కే ఫోర్ కొట్టిన ఆమె కిమ్ గార్త్ వేసిన నాలుగో ఓవర్లో మూడు బౌండ్రీలతో అలరించింది. తర్వాతి ఓవర్లో ఇంకో బౌండ్రీ రాబట్టిన షెఫాలీ మరో షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్కు చిక్కడంతో తొలి వికెట్కు 39 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. తొలి ఐదు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేకపోయిన మంధాన.. గార్డ్నర్ వేసిన ఆరో ఓవర్లో 6, 4తో జోరు పెంచి స్కోరు 50 దాటించింది. కానీ, వరుస ఓవర్లలో స్మృతితో పాటు జెమీమా రోడ్రిగ్స్ (2), కెప్టెన్ హర్మన్ కౌర్ (3)ను ఔట్ చేసిన ఆసీస్ సగం ఓవర్లకు ఇండియాను 66/4తో కష్టాల్లో పడేసింది. ఈ దశలో యంగ్స్టర్ రిచా ఇన్నింగ్స్ బాధ్యత తీసుకుంది. స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే భారీ షాట్లతో అలరించింది. సపోర్ట్ ఇచ్చిన దీప్తి శర్మ (14) ఔటైనా మేఘన్ వేసిన 16వ ఓవర్లో 6, 4.. వారెహమ్ బౌలింగ్లో మరో 6,4తో ఘోష్ చెలరేగడంతో ఇండియా భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే తర్వాతి రెండు ఓవర్లలో 11 రన్సే వచ్చాయి. చివరి ఓవర్లో ఘోష్ ఔటైనా అమన్జోత్ (17 నాటౌట్) ఫోర్ రాబట్టగా.. పూజా వస్త్రాకర్ (7 నాటౌట్) సిక్స్తో ఇన్నింగ్స్ ముగించింది.
ఆసీస్ అలవోకగా
కెరీర్లో 150వ టీ20 ఆడుతున్న అలీసా హీలీ, బెత్ మూనీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి ఛేజింగ్ను వన్సైడ్ చేశారు. ఇన్నింగ్స్ రెండో బాల్నే మూనీ బౌండ్రీ చేర్చగా.. టిటాస్ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లతో హీలీ గేరు మార్చింది. రేణుకా వేసిన తర్వాతి ఓవర్లో 6,4,4తో రెచ్చిపోయింది. ఆమె జోరుకు పవర్ ప్లేలోనే ఆసీస్ 54/0 స్కోరు చేసింది. వస్త్రాకర్ వేసిన తర్వాతి ఓవర్లో జెమీమాకి హీలీ క్యాచ్ ఇచ్చినా రీప్లేల్లో బాల్ ముందుగా గ్రౌండ్ను తాకిందో లేదో స్పష్టంగా తేలకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న హీలీ 34 బాల్స్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. దీప్తి వేసిన పదో ఓవర్లో తను ఎల్బీ అవ్వడంతో తొలి వికెట్కు 85 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అయినా తాలియా మెక్గ్రాత్ (20) తోడుగా మూనీ జోరు కొనసాగించింది. , 15వ ఓవర్లో వస్త్రాకర్ వరుస బాల్స్లో మెక్గ్రాత్, పెర్రీ (0)ని ఔట్ చేసి కాస్త ఆశలు రేపింది. కానీ ఇండియాకు మరో చాన్స్ ఇవ్వని మూనీ ఫామ్లో ఉన్న లిచ్ఫీల్డ్ (17 నాటౌట్) సపోర్ట్తో టార్గెట్ను కరిగించింది. 19వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో మ్యాచ్ను ముగించింది.