
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద బియ్యం దిగుమతిదారైన ఫిలిప్పీన్స్కు రైస్ ఎగుమతులను పెంచాలని ఇండియా చూస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రముఖ ఎగుమతిదారుల బృందం సెప్టెంబర్లో ఫిలిప్పీన్స్ను సందర్శించనుంది. కిందటేడాది ఈ దేశం 20 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. భారత్ నుంచి 413 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ప్రధానంగా మాంసం, పల్లీలు, బియ్యం, పొగాకును ఎగుమతి చేశాం. భారత్ ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్నప్పటికీ, ఫిలిప్పీన్స్కు జరిగే ఎగుమతులు కేవలం 48.91 మిలియన్ డాలర్లు మాత్రమే.
ఈ దేశానికి ఎక్స్పోర్ట్స్ పెంచేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. వరల్డ్ ఫుడ్ ఇండియా (సెప్టెంబర్ 25–28), ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ (అక్టోబర్ 30–31)లో ఫిలిప్పీన్స్కు చెందిన దిగుమతిదారులు పాల్గొననున్నారు. రైస్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పల్లీలు, మాంసం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచడంపై చర్చించనున్నారు. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సీఐఎస్) ప్రాంతానికి భారత్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 2024–25లో 628 మిలియన్ డాలర్లకు పెరిగాయి. సీఐఎస్లో రష్యా ప్రధాన భాగస్వామిగా ఉంది.