
- 71 రన్స్ తేడాతో జింబాబ్వేపై గెలుపు
- సూర్య కుమార్, రాహుల్ ఫిఫ్టీలు
- ముగిసిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 12
మెల్బోర్న్: బౌలర్ ఎవరైనా.. ఫీల్డర్ ఎక్కడున్నా.. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉన్నా.. బాల్ మాత్రం బౌండరీ దాటాల్సిందే..! భయపెట్టే ఇన్స్వింగర్ అయినా.. బెంబేలెత్తించే ఔట్ స్వింగర్ వేసినా... ఫుల్ లెంగ్త్, లో బౌన్స్, షార్ట్ పిచ్, ఎక్స్ట్రా బౌన్స్.. ఇలా ఎన్ని రకాల బంతులు వేసినా.. దంచికొట్టాల్సిందే..! టీ 20 వరల్డ్ కప్లో ‘మిస్టర్ 360’ సూర్య కుమార్ యాదవ్ (25 బాల్స్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 నాటౌట్) బ్యాటింగ్ తీరు ఇది. తొలి రోజు పాకిస్తాన్తో మొదలుపెడితే.. జింబాబ్వే వరకు తన సత్తా ఏంటో చూపెట్టాడు. ఫలితంగా ఆదివారం జరిగిన సూపర్–12, గ్రూప్–2 ఆఖరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 71 రన్స్ తేడాతో జింబాబ్వేను ఓడించి గ్రూప్2 టాపర్గా సెమీస్లోకి దూసుకెళ్లింది. టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 186/5 స్కోరు చేసింది. సూర్యతో పాటు కేఎల్ రాహుల్ (35 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. తర్వాత జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 రన్స్కే ఆలౌటైంది. ర్యాన్ బర్ల్ (35), సికిందర్ రజా (34) ఫర్వాలేదనిపించారు. సూర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆఖరి మ్యాచ్కు ముందే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న ఇండియా 4 విజయాలు, ఓ ఓటమి, 8 పాయింట్లతో గ్రూప్‑–2 టాపర్గా నిలిచింది. గురువారం జరిగే రెండో సెమీస్లో గ్రూప్1 సెకండ్ ప్లేస్లో నిలిచిన ఇంగ్లండ్తో తలపడుతుంది.
రాహుల్, సూర్య జోరు..
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇండియాకు నాలుగో ఓవర్లోనే రోహిత్ (15) ఔట్తో షాక్ తగిలినా.. రాహుల్ నిలకడగా ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు విరాట్ (26) కూడా ఫామ్ను చూపెట్టాడు. దీంతో సగం ఓవర్లకు ఇండియా 79/1తో నిలిచింది. కానీ 12వ ఓవర్లో కోహ్లీ ఔట్తో రెండో వికెట్కు 60 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ దశలో వచ్చిన సూర్య జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేస్తూ పరుగుల సునామీ సృష్టించాడు. 13వ ఓవర్ ఫస్ట్ బాల్కు రాహుల్ సిక్స్తో జోరు పెంచినా.. తర్వాతి బాల్కు వెనుదిరిగాడు. ఆ వెంటనే పంత్ (3) కూడా ఔటవగా.. హార్దిక్ పాండ్యా (18) వేగంగా ఆడలేదు. అయితే, 16వ ఓవర్లో సూర్య వరుసగా రెండు ఫోర్లతో స్పీడు పెంచాడు. ఆతర్వాతి రెండు ఓవర్లనూ కండ్లు చెదిరే షాట్లతో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు రాబట్టాడు. చివరి ఓవర్లో పాండ్యా ఔటైనా... సూర్య 6, 4, 6తో ఫిఫ్టీ పూర్తి చేయడంతో పాటు జట్టుకు భారీ స్కోరు అందించాడు. సీన్ విలియమ్స్ 2 వికెట్లు తీశాడు.
అశ్విన్ మ్యాజిక్
భారీ టార్గెట్ ఛేజింగ్లో జింబాబ్వేకు ఏదీ కలిసి రాలేదు. ఆరంభంలో పేసర్లు షమీ (2/14), పాండ్యా (2/16), చివర్లో అశ్విన్ (3/22) జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేశారు. వెస్లీ (0), ఎర్విన్ (13), చకబ్వా (0), సీన్ విలియమ్స్ (11), టోనీ (5) స్వల్ప విరామాల్లో ఔట్ కావడంతో జింబాబ్వే 36 రన్స్కే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రజా, బర్ల్ నిలకడగా ఆడి ఆరో వికెట్కు 60 రన్స్ జత చేసినా అశ్విన్ దెబ్బకు లోయర్ ఆర్డర్ బ్యాట్లేత్తెసింది. మసకద్జా (1), నగరవా (1), చతార (4), ముజరబాని (0 నాటౌట్) నిరాశపర్చడంతో జింబాబ్వే కుప్పకూలింది.
1 ఈ ఏడాది టీ20ల్లో వెయ్యి రన్స్ పూర్తి చేసిన తొలి బ్యాటర్గా సూర్య కుమార్ (1026) రికార్డులకెక్కాడు. పాక్ ఓపెనర్ రిజ్వాన్ (924), విరాట్ కోహ్లీ (731) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
3 టీ 20 వరల్డ్కప్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన మూడో ఇండియన్ బ్యాటర్ సూర్య (23 బాల్స్). యువరాజ్ సింగ్ (12, 20 బాల్స్లో) రెండుసార్లు ఈ ఫీట్ను అందుకోగా, కేఎల్ రాహుల్ (18 బాల్స్) ఓసారి సాధించాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 186/5 (సూర్య 61*, రాహుల్ 51, సీన్ విలియమ్స్ 2/9).
జింబాబ్వే:17.2 ఓవర్లలో 115 ఆలౌట్
(బర్ల్ 35, రజా 34, అశ్విన్ 3/22).