- విదేశాల్లో బియ్యం కటకట
- రైస్ ఎగుమతులపై ఇండియా రిస్ట్రిక్షన్లు పెట్టడమే కారణం
వెలుగు బిజినెస్ డెస్క్: ఇప్పుడు ప్రపంచమంతా బియ్యం కోసం ఇండియా వైపు చూస్తోంది. కానీ, దేశంలోని ప్రజల ఆహార భద్రత దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం బియ్యం ఎగుమతులను నియంత్రిస్తోంది. నవంబర్ నెలలో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆహార వస్తువుల రేట్లు పెరగకుండా చూడాలనేది కేంద్ర ప్రభుత్వం టార్గెట్. అంతేకాదు, ఈ సీజన్లో ఒకవేళ ప్రొడక్షన్ తగ్గినా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. బియ్యం ఎగుమతులపై ఇండియా ఆంక్షలతో గ్లోబల్ఫుడ్ క్రైసిస్ తలెత్తే ప్రమాదం పొంచి ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు.
అమెరికాలో బియ్యం కోసం క్యూలు..
అమెరికాలోని ఎన్ఆర్ఐలు బియ్యం కొనుగోలుకు స్టోర్ల ముందు క్యూలు కట్టడం కొన్ని నెలల కిందట సోషల్ మీడియాలో వైరల్ అవడాన్ని చూశాం. బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నియంత్రణలు పెట్టనుందనే రూమర్లు రావడంతోనే అక్కడ కొనుగోళ్లకు లైన్లు కట్టారు. ఈ ఏడాది జులై నెలలో నాన్–బాస్మతి రైస్ ఎగుమతులపై మన ప్రభుత్వం నిషేధం విధించింది. దేశం నుంచి జరిగే బియ్యం ఎగుమతులలో నాన్–బాస్మతి రైస్ వాటా 25 శాతం. గ్లోబల్ రైస్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా వాటా 40 శాతం. కానీ, దేశంలోని డిమాండ్ దృష్ట్యా గత కొన్ని నెలలుగా గ్లోబల్ డిమాండ్స్ను ఇండియా పట్టించుకోవడం లేదు.
రైస్ ఎక్స్పోర్ట్పై ప్రైస్ రివ్యూ..
బాస్మతి రైస్ మినిమమ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ను రివ్యూ చేయనున్నట్లు ప్రభుత్వం కిందటి వారంలో ప్రకటించింది. బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ ప్రైస్ను గతంలో టన్నుకు 1200 డాలర్లుగా నిర్ణయించారు. అధిక రేటు ఎగుమతులపై ఎఫెక్ట్ చూపిస్తున్న నేపథ్యంలో ఆ రేటును రివ్యూ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్లు ఈ రేటును టన్నుకు 850 డాలర్లుగా నిర్ణయించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. బాస్మతి రైస్ ఎగుమతులను నియంత్రించే ఉద్దేశంతో ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం మినిమమ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ను 1200 డాలర్లుగా ప్రకటించింది.
ప్రీమియం బాస్మతి రైస్ పేరుతో అనధికారికంగా నాన్–బాస్మతి రైస్ ఎగుమతులు జరగకుండా చూడాలనే లక్ష్యంతోనే ఈ చర్య తీసుకున్నారు. పారాబాయిల్డ్ రైస్ఎగుమతి పైనా 20 శాతం అదనపు డ్యూటీని ఆగస్టు నుంచి విధిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది మార్చి చివరి దాకా అమలవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. రైతులు, ఎగుమతిదారుల డిమాండ్ నేపథ్యంలో బాస్మతి రైస్ మినిమమ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ను టన్నుకు 950 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులను కోట్ చేస్తూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని 300 మండీలలో (హోల్సేల్ మార్కెట్లు) బాస్మతి రైస్ కొనడాన్ని ఎగుమతిదారులు, మిల్లర్లు నిలిపి వేశారు. ప్రభుత్వం నిర్ణయించిన 1200 డాలర్ల రేటుతో గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేయలేకే వారు తమ కొనుగోళ్లను ఆపేశారని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నేపాల్ బోర్డర్లో స్మగ్లింగ్..
బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో నేపాల్ బోర్డర్లో స్మగ్లింగ్ భారీగా పెరిగింది. నేపాల్కు ఉద్దేశించిన 111.2 టన్నుల రైస్ను ప్రభుత్వ అధికారులు పట్టుకున్నారు.
నిషేధం ఎందుకు?
దేశంలో బియ్యం రిటైల్ రేట్లు అదుపు చేయడంతో పాటు, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉండేలా చూసేందుకే ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలోని 267 జిల్లాలలో జూన్– ఆగస్టు మధ్య కాలంలో వర్షపాతం తక్కువగా నమోదైనట్లు మెటరాలజీ డిపార్ట్మెంట్ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో కొంత ముందు చూపుతో వ్యవహరిస్తే మేలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సీజన్లో మన రైస్ ప్రొడక్షన్ 4 మిలియన్ టన్నులు తగ్గి 132 మిలియన్ టన్నులుగా రికార్డవుతుందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంచనా వేస్తోంది.