Air India Crash: దర్యాప్తులో మీ సాయం అవసరం లేదు.. ఐరాసకు తేల్చి చెప్పిన భారత్

Air India Crash: దర్యాప్తులో మీ సాయం అవసరం లేదు.. ఐరాసకు తేల్చి చెప్పిన భారత్

ఇండియా చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం అయిన ఎయిర్ ఇండియా క్రాష్. అహ్మదాబాద్ విమానాశ్రయంలో టేక్ ఆఫ్ అయిన నిమిషాల్లోనే మెడికో హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులతో మెడికోలతో కలిపి మొత్తం 275 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి  దర్యాప్తు ఆలస్యం అవుతుంది ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ లో తాము సహాయపడతామని ఐక్యరాజ్య సమితి (ఐరాస) (United Nations) భారత్ కు ఆఫర్ చేసింది. ఐరాస సహాయాన్ని భారత్ తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. 

 ఐక్యరాజ్యసమితికి చెందిన పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) దర్యాప్తులో సాయం చేసేందుకు ఒక పరిశీలకుడిని పంపడానికి ముందుకొచ్చింది. సాధారణంగా ప్రమాదం జరిగిన దేశం కోరితేనే ఐసీఏవో సాయం అందిస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఐసీఏవో నే ఈ దర్యాప్తులో సాయం చేసేందుకు భారత్ కు ప్రతిపాదన పంపింది. 

Also Read : దొరికితే ఖమేనీని ఖతం చేసే వాళ్లం

తమ పరిశీలకుడికి కనీసం పరిశీలన హోదా అయినా ఇవ్వాలని ఐసీఏవో కోరగా, భారత అధికారులు అందుకు నిరాకరించినట్టు అంతర్గత వర్గాల సమాచారం. బ్లాక్ బాక్స్ డాటా నిర్ధారణ ఆలస్యం అవుతున్న కారణంగా తమ సహాయం తీసుకోవాలని కోరిన యూఎన్ సహాయాన్ని తిరస్కరించిన విషయాన్ని ఇద్దరు టాప్ లెవెల్ అఫీషియల్స్ చెప్పినట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది. 

గతంలో భారీ విమాన ప్రమాదాలు జరిగినప్పుడు దర్యాప్తులో సహకారం అందించేందుకు ఐసీఏవో తమ సభ్యుడిని పంపేది. 2014 మలేషియా ప్లేన్ క్రాష్, 2020 ఉక్రెయిన్ జెట్ లైనర్ కూలినప్పుడు ఈ ఏజెన్సీ సహాయం చేసింది. అయితే ఈ ప్రమాదాల్లో ఆయా దేశాలు కోరితేనే సహాయకులను పంపిన ఐరాస.. ఇండియాకు తనంతట తాను సహాయకులను పంపుతామని చెప్పడం గమనార్హం. అయితే దర్యాప్తు తామే చేసుకోగలమని.. ఐరాస సాయం ప్రస్తుతానికి అవసరం లేదని ఇండియా తిరిస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. 

ప్రస్తుతం ఎయర ఇండియా ప్రమాదానికి  సంబంధించి భారత్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేస్తోంది. క్రాష్ అయిన రెండు వారాల తర్వాత దర్యాప్తు అధికారులు ఫ్లైట్ రికార్డర్ డాటా డౌన్ లోడ్ చేసుకున్నట్లు విమాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

మరోవైపు, దర్యాప్తులో కీలకమైన బ్లాక్ బాక్స్‌ల డేటా విశ్లేషణలో జాప్యం జరగడంపై భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు (జూన్ 13) ఒక బ్లాక్ బాక్స్ లభించగా, రెండో సెట్‌ను జూన్ 16న గుర్తించారు. 

'అనెక్స్ 13'గా పిలిచే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు వీలుగా ఫ్లైట్ రికార్డర్ల డేటాను ఎక్కడ విశ్లేషించాలనే దానిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ భారత అధికారులు ఈ విషయంలో చాలా ఆలస్యం చేశారని, దర్యాప్తు పురోగతిపై కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం కేవలం ఒక్కసారి మాత్రమే మీడియా సమావేశం నిర్వహించి, ప్రశ్నలకు తావివ్వకుండా ముగించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

అయితే, ఈ విమర్శలపై పేరు చెప్పడానికి ఇష్టపడని పౌర విమానయాన శాఖ అధికారి ఒకరు స్పందించారు. తాము అన్ని ఐసీఏవో నిబంధనలను పాటిస్తున్నామని, ముఖ్యమైన పరిణామాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తున్నామని ఆయన వివరించారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలపై ప్రాథమిక నివేదిక రావడానికి సుమారు 30 రోజుల సమయం పడుతుందని చెప్పారు.