నాగ్పూర్: టీ20 వరల్డ్కప్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ టీమిండియాలో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. బ్యాటింగ్ లైనప్లో పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా... బౌలింగ్, ఫీల్డింగ్లో మాత్రం రోజురోజుకూ దిగజారుతోంది. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఈ రెండు సమస్యలు కొట్టొచ్చినట్లు కనిపించడంతో.. వాటిని పరిష్కరించుకునే దిశగా రోహిత్ బృందం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆసీస్తో రెండో టీ20 కోసం రెడీ అయ్యింది. తొలి మ్యాచ్లో భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ వైఫల్యంతో ఓటమిపాలైన ఇండియా ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్లో 0 - 1తో వెనుకబడి ఉంది. దీంతో రెండో మ్యాచ్లోనైనా నెగ్గి లెక్క సరి చేయాలని హోమ్ టీమ్ టార్గెట్గా పెట్టుకుంది.
బుమ్రా వస్తడా?
వెన్ను నొప్పితో ఇంగ్లండ్, ఆసియా కప్కు దూరంగా ఉన్న బుమ్రా.. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకుని టీమ్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఫలితంగా బౌలింగ్ సమస్యలు తీరినట్లే అని భావించినా.. తొలి టీ20లో అతను ఆడలేదు. దీంతో బుమ్రా పూర్తిస్థాయి మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదనే అనుమానాలు మొదలయ్యాయి. మరి ఈ మ్యాచ్లోనైనా అతను బరిలోకి దిగుతాడా? అన్న దానిపై చర్చ ఊపందుకుంది. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ వైఫల్యం టీమ్ను ముంచుతోంది. పాకిస్తాన్, శ్రీలంక (ఆసియా కప్), ఆసీస్తో అతను వేసిన మూడు 19వ ఓవర్లలో 49 రన్స్ ఇచ్చుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. తొలి టీ20లో హార్దిక్తో కలిసి ముగ్గురు పేసర్లు 14 ఓవర్లలోనే 150కి పైగా రన్స్ ఇచ్చుకోవడం మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. మెగా ఈవెంట్కు ముందు ఇండియా కేవలం 5 టీ20లు మాత్రమే ఆడనుంది. మరి ఆలోగా వీళ్లు కుదురుకుంటారా? ఇదే వైఫల్యాన్ని కంటిన్యూ చేస్తారా? చూడాలి. పిచ్ ఎలాంటిదైనా వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న చహల్ కూడా ఫెయిలవుతున్నాడు.
బ్యాటర్లను ఇబ్బందుల్లో పడేసే బాల్స్ను అతను సృష్టించలేకపోతున్నాడు. జడేజా ప్లేస్కు సరిపోతాడని భావిస్తున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. తొలి మ్యాచ్లో తన సత్తా చూపెట్టాడు. మరి ఈ ఫామ్ను కంటిన్యూ చేస్తాడా? అన్నది తేలాలి. బౌలింగ్కు తోడు తొలి మ్యాచ్లో మూడు ఈజీ క్యాచ్లను డ్రాప్ చేయడంతో ఒక్కసారిగా ఇండియా ఫీల్డింగ్ హెడ్లైన్స్లోకి వచ్చేసింది. మాజీ కోచ్ రవిశాస్త్రితో పాటు మరికొంత మంది బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాటింగ్లో రాహుల్, హార్దిక్, సూర్యకుమార్ దూకుడు ఇండియాకు వరంగా మారింది. అయితే కెప్టెన్, మాజీ కెప్టెన్ రోహిత్, విరాట్.. తమ అనుభవాన్ని చూపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. సూపర్ ఫినిషర్ దినేశ్ కార్తీక్కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే చాన్స్ రాకపోయినా.. రాబోయే మ్యాచ్ల్లో అతను కచ్చితంగా ప్రభావం చూపిస్తాడని భావిస్తున్నారు. ఓవరాల్గా తొలి మ్యాచ్ తప్పులను సరిదిద్దుకుంటేనే ఈ మ్యాచ్లో ఇండియా విజయాన్ని ఆశించొచ్చు.
ఆసీస్ సమష్టిగా..
వార్నర్, స్టార్క్, స్టోయినిస్, మిచెల్ మార్ష్లాంటి స్టార్లు లేకపోయినా.. తొలి మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఇచ్చిన ఆరంభంతోనే కంగారూలు భారీ టార్గెట్ను ఛేదించగలిగారు. స్మిత్ ఫామ్లో ఉండగా, వేడ్ ఫినిషర్ రోల్కు బాగా న్యాయం చేస్తుండటం కలిసొచ్చే అంశం. అయితే బౌలింగ్లో కంగారూలు మరింత క్రమశిక్షణను చూపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. కమిన్స్, హేజిల్వుడ్, గ్రీన్ తమ లైన్లో బౌలింగ్ వేయలేకపోయారు. మొహాలీ ట్రాక్తో పోలిస్తే విదర్భ పిచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్లో బౌలింగ్కు అనుకూలం. కాబట్టి ఈ మ్యాచ్లో బౌలర్లు మరింత కీలక పాత్ర పోషించే చాన్స్ ఉంది. మంచు కారణంగా టాస్ గెలిస్తే ఛేజింగ్కే మొగ్గు చూపొచ్చు.