హైదరాబాద్, వెలుగు: వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలతో వాతావరణానికి కలిగే హానిని తగ్గించడానికి ఇన్నోవేటర్లు మరింత చురుగ్గా పనిచేయాలని ఐకేపీ చైర్మన్, సీఈవో దీపాన్వితా చటోపాధ్యాయ తెలిపారు. ఈ ప్రీమియర్ సైన్స్ పార్క్, బిజినెస్ ఇన్క్యుబేటర్ 16వ ఫ్లాగ్షిప్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ మిలీనియం కాన్ఫరెన్స్, ‘ఐకేఎంసీ 2022’ శనివారం హైదరాబాద్లో మొదలయింది. ఇది ఆదివారం కూడా కొనసాగుతుంది. ఐకేపీ ఎకోసిస్టమ్లు, ఇండస్ట్రీలు, ఇన్నోవేటర్లు.. మనుషులకు, పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను తగ్గించడానికి ఏం చేయాలనే విషయమై చర్చించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఈ సందర్భంగా దీపాన్విత మాట్లాడుతూ మహమ్మారి తరువాత వచ్చిన మార్పులను స్వీకరించడానికి భారతదేశం సిద్ధంగా ఉండాలన్నారు. ఐకేపీ వంటి ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడంపై ఈ సందర్భంగా కీలక ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, వర్క్షాప్లు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లోని 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తమ సైన్స్ పార్క్ క్రమంగా శక్తివంతమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్గా ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు కంపెనీలు, స్టార్టప్లు, ఇన్నోవేటర్లు, ఇంక్యుబేటర్ మేనేజర్లు, నిపుణులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హెల్త్టెక్, మెడ్టెక్, బయోఫార్మా, ఇండస్ట్రియల్ బయోటెక్, అగ్రిటెక్, ఏఐ & ఎంఎల్కు చెందిన కొన్ని స్టార్టప్లు తమ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నాయి.