- వరల్డ్ నం.1 అక్సెల్సెన్కు షాకిచ్చి సెమీస్ చేరిన షట్లర్
- వరల్డ్ చాంపియన్షిప్లో పతకం ఖాయం
కోపెన్హాగెన్ : ఇండియా స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. వరల్డ్ నంబర్ వన్, ఒలింపిక్ చాంప్ విక్టర్ అక్సెల్సెన్కు షాకిస్తూ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో సెమీఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకున్నాడు. అయితే, ఈ సీజన్లో సూపర్ ఫామ్తో దూసుకెళ్తూ గోల్డ్పై గురి పెట్టిన డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగారు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్లో తొమ్మిదో సీడ్ ప్రణయ్ 13–21, 21–15, 21–16తో టాప్ సీడ్ డెన్మార్క్ స్టార్ విక్టర్కు షాకిచ్చాడు.
68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ప్రణయ్ తొలి గేమ్ కోల్పోయి తడబడ్డాడు. రెండో గేమ్లోనూ తొలుత టఫ్ ఫైట్ నడిAచింది. 8–8తో స్కోరు సమమైన దశలో ఇండియా ప్లేయర్ ఒక్కసారిగా పుంజుకున్నాడు. తన మార్కు షాట్లతో వరుస పాయింట్లు రాబడుతూ 17–11తో ఆధిక్యంలోకి వచ్చాడు. అదే జోరుతో గేమ్ నెగ్గి మ్యాచ్లో నిలిచాడు. ఇక మూడో గేమ్లోనూ తొలుత చెరో పాయింట్ నెగ్గుతూ వెళ్లడంతో 2–2, 4–4, 6–6తో ఆట సాగింది.
మరోసారి గేరు మార్చిన ప్రణయ్ వరుసగా ఐదు పాయింట్లతో 12–6తో లీడ్లోకి వచ్చాడు. ఆపై, విక్టర్కు ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ నెగ్గాడు. శనివారం జరిగే సెమీస్లో మూడో సీడ్ కున్లావుట్ (థాయ్లాండ్)తో తలపడనున్నాడు. ఇక, డబుల్స్ క్వార్టర్స్లో రెండో సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 18–21, 19–21తో లోకల్ ఫేవరెట్స్ 11వ సీడ్ కిమ్ అస్ట్రుప్–స్కారుప్ ( డెన్మార్క్) ద్వయం చేతిలో పోరాడి ఓడింది.