న్యూఢిల్లీ: ఏ దేశ భవిష్యత్ను అయినా నిర్దేశించే శక్తి ఎగుమతులకు ఉందని కేంద్ర వాణిజ్య, ఆహారభద్రతలశాఖల మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. అన్ని రంగాల ఎగుమతులను పెంచేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. హైదరాబాద్లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) శుక్రవారం ‘ఇండియా ఎగుమతిదారులకు గ్లోబల్ మార్కెట్లో అవకాశాలు’ అనే అంశంపై నిర్వహించిన చర్చాకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో మనదేశంలో 675 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించిందని, ఈ సంవత్సరం వీటి విలువను 750 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.61 లక్షల కోట్లు) పెంచాలనే టార్గెట్తో పనిచేస్తున్నామని చెప్పారు. ‘‘ఈ టార్గెట్ను సాధించాలంటే తయారీదారులు నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. మీ సమస్యలను వినడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎగుమతులకు మేకిన్ ఇండియా కార్యక్రమం చాలా ముఖ్యం. మన ఎకానమీ డెవెలప్ కావాలంటే టూరిజం ముఖ్యం. మనందరం ప్రయాణాలు చేసేటప్పుడు ఖర్చు చేసేదాంట్లో కనీసం ఐదుశాతం మొత్తాన్ని స్థానికంగా తయారయ్యే వస్తువులను కొనడానికి ఖర్చు చేయాలి”అని అన్నారు.
30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుతాం
ఈ కార్యక్రమానికి ముందు ఆంధ్రప్రదేశ్ నగరం కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ విదేశీ వాణిజ్యానికి పెద్దపీటు వేస్తున్నామని, అమృత్ కాల్లో భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అన్నారు. అనేక దేశాలు ఇండియాతో ‘ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్’ను కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇండియా 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా మారుతుందని స్పష్టం చేశారు. గ్లోబల్ సప్లై చెయిన్, సర్వీసుల్లో ఇండియా విదేశీ వాణిజ్యం చురుగ్గా ఉండాలని మంత్రి అన్నారు. ఇండియాకు అద్భుతమైన భవిష్యత్ ఉందని ఐఎంఎఫ్ చెప్పిందన్నారు.