ఇంకో ఆరేండ్లలోనే జపాన్ను దాటేస్తం
2030 నాటికి 7.3 బిలియన్ డాలర్లకు దేశ ఎకానమీ
జర్మనీనీ అధిగమించి గ్లోబల్గా మూడో ప్లేస్కు..
పెరుగుతున్న ఎఫ్డీఐలు..ఈ-కామర్స్ సెక్టార్ జూమ్
వెల్లడించిన ఎస్ అండ్ పీ గ్లోబల్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకో ఆరేళ్లలోనే ఆసియాలోనే రెండో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఇండియా ఎకానమీ గ్లోబల్గా ఐదో ప్లేస్లో కొనసాగుతోంది. 2021, 2022 లో దేశ ఎకానమీ వేగంగా వృద్ధి చెందింది. గ్లోబల్గా జియో పొలిటికల్ టెన్షన్లు కొనసాగినప్పటికీ, ఇన్ఫ్లేషన్ ఇబ్బంది పెట్టినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ మిగిలిన దేశాలతో పోలిస్తే వేగంగా వృద్ధి సాధించింది. ఈ ఏడాది కూడా ఇలాంటి ట్రెండే కొనసాగుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ తాజాగా ఇష్యూ చేసిన పీఎంఐ రిపోర్ట్లో పేర్కొంది.
2030 నాటికి ఇండియా ఎకానమీ 7.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, జపాన్ను దాటి ఆసియాలో రెండో అతిపెద్ద ఎకానమీగా మారుతుందని అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.2–6.3 శాతం గ్రోత్ సాధిస్తుందని, వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో టాప్లో ఉంటుందని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ క్వార్టర్లో ఇండియా జీడీపీ 7.8 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) వృద్ధి చెందిన విషయం తెలిసిందే. లోకల్గా డిమాండ్ బాగుందని 2023, 2024 లో ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ పేర్కొంది.
లాంగ్ టెర్మ్లో స్ట్రాంగ్గా
దేశంలోకి వస్తున్న విదేశీ ఇన్వెస్ట్మెంట్ల గురించి ఎస్ అండ్ పీ గ్లోబల్ ప్రస్తావించింది. గత పదేళ్ల నుంచి ఇండియాలోకి వస్తున్న విదేశీ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ (ఎఫ్డీఐ) పెరుగుతున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ లాంగ్ టెర్మ్లో బాగుంటుందనే సంకేతాలను ఇది ఇస్తోందని వివరించింది. పనిచేయగలిగే యువత ఉండడం, సిటీల్లోని ప్రజల ఆదాయాలు పెరుగుతుండడంతో ఇండియన్ ఎకానమీ స్థిరంగా ఉందని పేర్కొంది.
‘ఇండియా నామినల్ జీడీపీ 2022లో 3.5 ట్రిలియన్లుగా నమోదయ్యింది. 2030 నాటికి ఈ నెంబర్ 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఎకానమీ వేగంగా విస్తరించడం వలన ఇండియా జీడీపీ జపాన్ను అధిగమిస్తుంది. ఆసియా– పసిఫిక్ రీజియన్లో రెండో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుంది’ అని ఎస్ అండ్ పీ గ్లోబల్ వివరించింది.
కాగా, 2022 నాటికే దేశ జీడీపీ ఇంగ్లండ్, ఫ్రాన్స్ను దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. 2030 నాటికి దేశ జీడీపీ జర్మనీని కూడా అధిగమిస్తుందని అంచనా. ప్రస్తుతం యూఎస్ ఎకానమీ 25.5 ట్రిలియన్ డాలర్లతో గ్లోబల్ సూపర్ పవర్గా కొనసాగుతోంది. ప్రపంచ జీడీపీలో యూఎస్ వాటానే 25 శాతం. 18 ట్రిలియన్ డాలర్లతో చైనా రెండో ప్లేస్లో కొనసాగుతోంది. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 17.9 శాతంగా ఉంది. జపాన్ జీడీపీ 4.2 ట్రిలియన్ డాలర్లే అయినా గ్లోబల్గా మూడో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. 4 ట్రిలియన్ డాలర్లతో జర్మనీ నాల్గో ప్లేస్లో ఉంది.
అనేక కారణాలు..
ఇండియా ఎకానమీ లాంగ్టెర్మ్లో మరింతగా విస్తరిస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ చెబుతోంది. ఇందుకు గల కారణాలను కూడా వివరించింది. ‘ముఖ్యంగా ఇండియాలో మిడిల్ క్లాస్ జనాభా చాలా ఎక్కువగా ఉన్నారు. వేగంగా వృద్ధి చెందుతున్నారు. ఫలితంగా వినియోగం పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉండడంతో పాటు ఇండస్ట్రియల్ సెక్టార్ విస్తరిస్తుండడంతో పెట్టుబడులకు ఇండియా ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది.
మాన్యుఫాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసెస్తో పాటు అనేక సెక్టార్లలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి’ అని ఎస్ అండ్ పీ గ్లోబల్ వివరించింది. దేశంలో డిజిటల్ వాడకం వేగంగా విస్తరించిందని, ఈ–కామర్స్ వృద్ధి చెందుతోందని తెలిపింది. వచ్చే పదేళ్లలో కన్జూమర్ల షాపింగ్ విధానాలు మారిపోతాయని తెలిపింది. ఫలితంగా గ్లోబల్ టెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇండియా వైపు ఆకర్షితులవుతాయని వెల్లడించింది.
‘2030 నాటికి 110 కోట్ల మంది ఇంటర్నెట్ వాడగలుగుతారు. 2020 లో నమోదైన 50 కోట్ల మందితో పోలిస్తే ఇది రెండింతలు కంటే ఎక్కువ. ఈ–కామర్స్ వృద్ధి చెందుతుండడం, 4జీ నుంచి 5జీ కి షిఫ్ట్ అవ్వడంతో బిగ్బాస్కెట్, డెల్హివరీ వంటి లోకల్ యూనికార్న్ స్టార్టప్లు మరింత విస్తరించగలుగుతాయి’ అని ఎస్ అండ్ పీ గ్లోబల్ అంచనా వేసింది. కరోనా టైమ్లో కూడా ఇండియాలోకి పెద్ద మొత్తంలో విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని, గూగుల్, ఫేస్బుక్ వంటి టెక్ ఎంఎన్సీలతో పాటు మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు కూడా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయని తెలిపింది. మొత్తంగా వచ్చే పదేళ్ల పాటు వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా కొనసాగుతుందని అంచనా వేసింది.