లండన్: వారెవ్వా.. ఏం ఆట.. ఏం బౌలింగ్..! సెకండ్ టెస్ట్ ఐదో రోజు టీమిండియా పేసర్లు అద్భుతం చేశారు. డ్రా చేసుకుంటే గొప్ప అనుకున్న మ్యాచ్లో ఏకంగా గెలిచి చూపెట్టారు. హైదరాబాద్ స్టార్ మహ్మద్ సిరాజ్(4/32) ముప్పేట చేసిన దాడికి బుమ్రా (3/33), షమీ (1/13), ఇషాంత్ (2/13) అండగా నిలవడంతో.. సోమవారం ముగిసిన మ్యాచ్లో ఇండియా 151 రన్స్ తేడాతో ఇంగ్లండ్పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1–0 లీడ్లో నిలిచింది. టీమిండియా నిర్దేశించిన 272 రన్స్ టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 51.5 ఓవర్లలో120 రన్స్కు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (33) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ మూడో బాల్కే బర్న్స్ (0)ను ఔట్ చేసి వికెట్ల పతనాన్ని బుమ్రా మొదలుపెడితే.. ఆఖర్లో అద్భుతమైన ఆఫ్ కట్టర్తో అండర్సన్ (0) వికెట్ తీసిన సిరాజ్.. ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతకుముందు 181/6 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ను 109.3 ఓవర్లలో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మహ్మద్ షమీ (56 నాటౌట్), బుమ్రా (34 నాటౌట్) అద్భుత బ్యాటింగ్తో ఇండియాను ఆదుకున్నారు. కేఎల్ రాహుల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
చకచకా..
టార్గెట్ ఛేజింగ్లో ఇంగ్లండ్ను మన పేసర్లు వణికించారు. బాల్ను రెండువైపులా స్వింగ్ చేస్తూ, అద్భుతమైన ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టారు. ఫస్ట్ ఓవర్లో బర్న్స్ను బుమ్రా, రెండో ఓవర్లో సిబ్లే (0)ను ఔట్చేసిన షమీ మంచి బ్రేక్ ఇచ్చారు. ఈ దశలో రూట్ కాస్త ఫర్వాలేదనిపించినా.. రెండో ఎండ్లో చకచకా వికెట్లు తీసి ఇంగ్లండ్ను ఒత్తిడిలో పడేశారు. ఫలితంగా హసీబ్ హమీద్ (9), బెయిర్స్టో (2), మొయిన్ అలీ (13), సామ్ కరన్ (0) స్వల్ప విరామాల్లో తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ఇంగ్లండ్ 90 రన్స్కే 7 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది. ఈ టైమ్లో బట్లర్ (25), రాబిన్సన్ (9) ఎనిమిదో వికెట్కు 30 రన్స్ జోడించి డ్రా వైపు తీసుకెళ్లారు. అయితే ఓవర్లు తక్కువగా ఉండటంతో విరాట్ స్ట్రాటజీ మార్చాడు. బుమ్రాకు బాల్ ఇచ్చాడు. ఓ స్లో బాల్తో రాబిన్సన్ను బుమ్రా ఎల్బీ చేసి పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో సిరాజ్ డబుల్ మ్యాజిక్ చూపెట్టాడు. నాలుగు బాల్స్ తేడాలో బట్లర్, అండర్సన్ వికెట్లు పడగొట్టడంతో ఇండియా విజయం ఖాయమైంది.
సూపర్ షమీ..
భారీ ఆశలతో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన ఇండియాను స్టార్టింగ్లోనే ఇంగ్లిష్ బౌలర్లు దెబ్బతీశారు. పంత్ (22)ను రాబిన్సన్ (2/45)ను అద్భుతమైన ఆఫ్ కట్టర్తో పెవిలియన్కు చేర్చాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ.. ఇంగ్లండ్ను ఓ ఆటాడుకున్నాడు. కాసేపు పోరాడిన ఇషాంత్ (16) రాబిన్సన్ బౌలింగ్లో ఎల్బీ అవడంతో 209 రన్స్ వద్ద ఇండియా 8వ వికెట్ కోల్పోయింది. ఈ టైమ్లో వచ్చిన బుమ్రా.. షమీకి చక్కని సహకారం అందించాడు. ఇద్దరు టెయిలెండర్లు కావడంతో రూట్.. ఫీల్డింగ్ను విస్తరించి ఏరియల్ షాట్లు కొట్టే చాన్స్ ఇచ్చాడు. కానీ అతని అంచనాలను తలకిందులు చేస్తూ.. ఈ ఇద్దరూ సొంత ప్లేయర్లు ఆశ్చర్యపోయేలా చూడముచ్చటైన క్రికెటింగ్ షాట్లతో అలరించారు. బుమ్రా డిఫెన్స్, షమీ అటాక్.. ఇంగ్లండ్ను ఫ్రస్ట్రేషన్కు గురి చేసింది. దీంతో రూట్, అండర్సన్.. ఈ ఇద్దరితో గొడవకు దిగారు. అయినా అదే నిలకడను కొనసాగించిన షమీ 57 బాల్స్లో హాఫ్ సెంచరీ సాధించాడు. చివరకు లంచ్ తర్వాత ఒకటిన్నర ఓవర్ ఆడించిన కోహ్లీ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 364, ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 391, ఇండియా సెకండ్ ఇన్నింగ్స్: 298/8 డిక్లేర్డ్ (షమీ 56 నాటౌట్, బుమ్రా 34 నాటౌట్, మార్క్ వుడ్ 3/51), ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్: 120 ఆలౌట్ (రూట్ 33, బట్లర్ 25, సిరాజ్ 4/32).
మజా ఆగయా
సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుత బ్యాటింగ్తో ఇండియాను ఆదుకున్న పేసర్లు షమీ, బుమ్రాపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. వీళ్ల బ్యాటింగ్ చూస్తే మజా కలిగిందని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. షమీ, బుమ్రా పోరాటాన్ని సెహ్వాగ్ 2001 ఈడెన్ గార్డెన్స్లో ఆస్ట్రేలియాపై లక్ష్మణ్–ద్రవిడ్ హిస్టారికల్ పార్ట్నర్షిప్తో పోల్చాడు నాటి మ్యాచ్కు సంబంధించిన ఫొటోలో లక్ష్మణ్, ద్రవిడ్ ముఖాలను షమీ, బుమ్రా ఫేస్లతో మార్పింగ్ చేసి ట్విటర్లో షేర్ చేశాడు. వీళ్ల ఆట చూసి చాలా ఆనందించానన్నాడు. ఇద్దరు పేసర్లు అద్భుతంగా ఆడారని సచిన్ కొనియాడాడు. ఈ పార్ట్నర్షిప్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చాలాకాలం నిలిచిపోతుందని బీసీసీఐ పేర్కొంది.