- నేడు శ్రీలంకతో ఇండియా తొలి వన్డే
- బరిలోకి రోహిత్, కోహ్లీ, కేఎల్
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
గువాహతి: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీ20 టీమ్ శ్రీలంకతో టీ20 సిరీస్ నెగ్గింది. కొత్త ఏడాదికి మంచి ఆరంభం ఇచ్చింది. ఇప్పుడు రోహిత్ శర్మ వంతొచ్చింది. షార్ట్ ఫార్మాట్లో పాండ్యా అండ్ కో చూపెట్టిన జోరును... రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా వన్డేల్లో చూపెట్టాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగే తొలి మ్యాచ్లో ఇండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టీ20లకు రెస్ట్ తీసుకున్న రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో జట్టు బలం పెరిగింది. కానీ, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తాడని ఆశించిన పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో చివరి నిమిషంలో తప్పుకోవడం కాస్త ప్రతికూల అంశం. ఇక, పేరుకు లంకతో పోటీ అయినప్పటికీ సొంతగడ్డపై అక్టోబర్–నవంబర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ పై కన్నేసి రోహిత్సేన ఈ సిరీస్లో ఆడనుంది. వరల్డ్కప్నకు ముందు ఇండియాకు ఆసియాకప్ కాకుండా 15 వన్డేలు ఉన్నాయి. ఈ పది నెలల్లో మెగా టోర్నీలో ఆడే టీమ్ కాంబినేషన్ను సెట్ చేసుకోవడంతో పాటు ఐపీఎల్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ దృష్ట్యా ప్లేయర్ల వర్క్ లోడ్ను మేనేజ్ చేయాల్సి ఉంటుంది. బుమ్రా తరచూ గాయపడుతున్న నేపథ్యంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్ టీమ్కు కీలకం కానుంది.
ఓపెనర్గా గిల్.. ఇషాన్, సూర్యకు నో ప్లేస్!
స్టార్ ప్లేయర్లు తిరిగి రావడంతో తుది జట్టులో చోటుకు పోటీ పెరిగింది. రోహిత్, కోహ్లీ, రాహుల్, శ్రేయస్ టీమ్లో ఉండాలంటే మిగతా వాళ్లపై వేటు వేయాల్సిన పరిస్థితి. టీ20 సిరీస్లో శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేశారు. కానీ, కెప్టెన్, ఓపెనర్ రోహిత్ ఎంట్రీతో ఈ ఇద్దరిలో ఒకరికే ప్లేస్ ఉంటుంది. కొన్నాళ్లుగా వన్డేల్లో నిలకడ చూపిస్తున్న గిల్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, తనే ఓపెనర్గా వస్తాడని రోహిత్ స్పష్టం చేశాడు. దాంతో, తన చివరి వన్డేలో బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్ బెంచ్కు పరిమితం కావాల్సి వస్తోంది. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో ఆడకపోయినా.. ఈ ఫార్మాట్లో గిల్ తన టాలెంట్ చూపించుకున్నాడు. వన్డౌన్లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం ఖాయం. లంకపై మంచి రికార్డున్న విరాట్ అదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక, నాలుగో ప్లేస్ కోసం శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. అయ్యర్ గతేడాది వన్డేల్లో ఇండియా టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంకోవైపు టీ20ల్లో సూర్య దుమ్మురేపుతున్నాడు. లంకతో మూడో టీ20లో మెరుపు సెంచరీతో భీకర ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒక్కరినే ఎంచుకోవడం కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్కు తలనొప్పే. పంత్ లేకపోవడంతో కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు తీసుకుంటాడు. గతేడాది తీవ్రంగా నిరాశ పరిచిన కేఎల్.. కొత్త ఏడాదైనా గాడిలో పడతాడేమో చూడాలి. బౌలింగ్లో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ జోరు మీదుండగా.. వెటరన్ పేసర్ మహ్మద్ షమీ రాకతో పేస్ బలం పెరిగింది. మూడో పేసర్గా యంగ్స్టర్స్ అర్ష్ దీప్, ఉమ్రాన్ మాలిక్ మధ్య పోటీ ఉంది. ఇక, కొత్త వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రూపంలో మరో పేసర్ అందుబాటులో ఉన్నా.. అతను ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తాడో చెప్పలేం. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ బరిలోకి దిగడం ఖాయమే. మెయిన్ స్పిన్నర్గా చహల్ను కొనసాగిస్తారా? లేక చైనామన్ కుల్దీప్ యాదవ్కు చాన్స్ ఇస్తారో చూడాలి.
టాపార్డర్పై లంక ఫోకస్
టీ20 సిరీస్లో ఇండియాకు గట్టి పోటీ ఇచ్చిన శ్రీలంక వన్డేల్లో మరింత బాగా ఆడాలని కోరుకుంటోంది. అయితే, టీ20లతో పోలిస్తే వన్డేల్లో ఈ మధ్య శ్రీలంక పెద్దగా ప్రభావం చూపడం లేదు. స్టార్ ఆల్రౌండర్ దసున్ షనక టీమ్ను ముందుండి నడిపిస్తున్నప్పటికీ టాపార్డర్ నుంచి పెద్దగా సపోర్ట్ దొరకడం లేదు. 50 ఓవర్ల పోరులో అయినా ఓపెనర్లు కుశాల్ మెండిస్, నిశాంక మెరుగవ్వాలని షనక కోరుకుంటున్నాడు. గతేడాది బాగా ఆడిన మిడిలార్డర్ బ్యాటర్ చరిత్ అసలంకపై కూడా బాధ్యత ఉంది. లెగ్ స్పిన్నర్ జెఫ్రే వాండర్సే ఇండియా వికెట్లపై రాణించగలడని లంక ఆశిస్తోంది.