
- చివరి పూల్ మ్యాచ్లో 5-1తో ఇటలీపై గ్రాండ్ విక్టరీ
- ఉదిత డబుల్ ధమాకా
- హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్
రాంచీ : పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫై అయ్యేందుకు ఇండియా విమెన్స్ హాకీ టీమ్ మరో అడుగు ముందుకేసింది. సొంతగడ్డపై ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో సూపర్ పెర్ఫామెన్స్తో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన పూల్–బి చివరి మ్యాచ్లో ఇండియా 5–-1 తో ఇటలీని ఓడించింది. దాంతో పూల్లో రెండో ప్లేస్తో నాకౌట్కు చేరుకుంది.
తన 100వ ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఉదిత దుహన్ (1, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్తో డబుల్ ధమాకా మోగించగా.. దీపిక (41వ ని), సలీమా టెటె (45వ ని), నవనీత్ కౌర్ (53వ ని) ఒక్కో గోల్ చేశారు. గురువారం జరిగే సెమీఫైనల్లో పూల్–ఎ టాపర్ జర్మనీతో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్లో పూల్–బి టాపర్ అమెరికాతో జపాన్ పోటీ పడుతుంది. ఫైనల్ చేరే టీమ్స్తో పాటు థర్డ్ ప్లేస్ మ్యాచ్లో గెలిచే జట్టు ఒలింపిక్స్కు క్వాలిఫై అవుతుంది.
ఆరంభం నుంచే జోరు
ఇండియా సెమీస్ చేరేందుకు ఈ మ్యాచ్లో డ్రా మాత్రమే అవసరమైంది. కానీ, ఆతిథ్య అమ్మాయిలు ఇటలీపై గోల్స్ వర్షం కురిపించారు. ఆట మొదలైన 38 సెకండ్లలోనే సలీమా టెటె పెనాల్టీ కార్నర్ రాబట్టింది. దీన్ని ఉదిత గోల్గా మలచడంతో ఇండియా 1–0తో ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఇండియా దూకుడు నిలువరించేందుకు ఇటలీ తమ డిఫెన్స్ను మెరుగుపరుచుకోవడంతో తొలి రెండు క్వార్టర్స్లో మరో గోల్ రాలేదు. మూడో క్వార్టర్లో ఇండియా మళ్లీ జోరు పెంచింది. లాల్రెమ్సియామిని 41వ నిమిషంలో అలెమాన్చె ఉద్దేశపూర్వకంగా కిందపడేయంతో ఇండియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది.
దీన్ని గోల్ చేసిన దీపిక ఇండియా ఆధిక్యాన్ని డబుల్ చేసింది. ఈ గోల్ తర్వాత ఇటలీ డిఫెన్స్ చెల్లాచెదురైంది. ఈ చాన్స్ను సద్వినియోగం చేసుకున్న సలీమా సర్కిల్ చివర్లో లభించిన బాల్ను నెట్లోకి కొట్టి ఇండియాకు మూడో గోల్ అందించింది. చివరి క్వార్టర్లో నవనీత్ ముగ్గురు డిఫెండర్లను తప్పించుకొని జట్టుకు నాలుగో గోల్ అందించగా.. రెండు నిమిషాల తర్వాత లభించిన పెనాల్టీ కార్నర్ను ఉదిత గోల్గా మలచడంతో ఇండియా ఏకంగా 5–0తో లీడ్లో నిలిచింది. మరికొన్ని సెకండ్లలో ఆట ముగుస్తుందనగా లభించిన పెనాల్టీ కార్నర్కు మచిన్ చమిలా గోల్ చేసి ఇటలీకి ఊరట కలిగించింది. మరో పూల్–బి మ్యాచ్లో న్యూజిలాండ్ 0–1తో యూఎస్ఏ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. పూల్–ఎలో జర్మనీ 10–0తో చెక్ రిపబ్లిక్ను, జపాన్ 2–0తో చిలీని ఓడించాయి.