ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 350 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ జట్టు 337 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టార్గెట్ను ఛేదించేందుకు బరిలో దిగిన కివీస్ 141 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక టీమిండియా విజయం లాంఛనమే అనుకున్న టైమ్ లో క్రీజ్ లోకి వచ్చిన మైఖేల్ బ్రాస్వెల్(140) టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్సర్లతో విజృంభించాడు. 57 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. అతనికి తోడుగా శాంటర్న్ (57) నిలిచాడు. ఇద్దరు కలిసి దాదాపుగా 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే వీరిద్దరిని సిరాజ్ విడదీశాడు. ఆ తరువాత వచ్చిన షిప్లే డకౌట్ అయ్యాడు. వికెట్లు పడుతున్న మైఖేల్ బ్రాస్వెల్ మాత్రం సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయాడు. చివరి రెండు ఓవర్లలో టీమిండియా బౌలర్లు అతన్ని కట్టుదిట్టం చేయడంతో విజయం టీమిండియా సొంతం అయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1,0తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరగనుంది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు.