
- రూ.5,000 కోట్ల వరకు దిగొచ్చే చాన్స్
- వెల్లడించిన రేటింగ్ ఏజెన్సీ ఇక్రా
ముంబై: భారతీయ విమానయాన పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో తన నికర నష్టాలను రూ. 17,500–-17,000 కోట్ల నుంచి రూ. 3,000–-5,000 కోట్లకు తగ్గించుకోవచ్చని అంచనా వేస్తోంది. మెరుగైన దిగుబడులు, ఖర్చులు అదుపులో ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా మంగళవారం తెలిపింది. దీని రిపోర్ట్ ప్రకారం..2024 ఆర్థిక సంవత్సరం, 2025 ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 8–-13 శాతం పెరుగుతుంది. ప్రయాణీకుల ట్రాఫిక్ పెరుగుదల, మెరుగైన దిగుబడులు, తక్కువ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ అంచనాలను తయారు చేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణీకుల ట్రాఫిక్ 15 కోట్ల మందికి చేరుతుంది. పరిశ్రమ నికర నష్టం (అంచనా) 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 17 వేల కోట్ల నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000--–5,000 కోట్లకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని విమాన ప్రయాణీకుల రద్దీ 2025లోనూ కొనసాగుతుందని అంచనా. అయితే ప్రస్తుత స్థాయిల నుంచి దిగుబడులు మరీ ఎక్కువగా పెరగకపోవచ్చు. అందుకే నష్టాల తగ్గుదల రూ.ఐదు వేల కోట్ల వరకు ఉండవచ్చని ఇక్రా లిమిటెడ్ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ అన్నారు.
కొనసాగనున్న ఊపు..
విమాన ప్రయాణీకుల ట్రాఫిక్ వృద్ధి ఊపందుకుంటున్నది. 2025 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ఊపు కొనసాగవచ్చు. విమాన ప్రయాణానికి డిమాండ్ పెరగడం, విమానాశ్రయ మౌలిక సదుపాయాలను మెరుగుపడటం ఇందుకు కారణాలు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 10 కోట్ల మందికి చేరింది. ఇది సంవత్సరానికి 17 శాతం పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 2.39 కోట్ల వద్ద ఉన్న భారతీయ క్యారియర్ల అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ, కరోనాకు ముందు ఉన్న స్థాయిలను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.7 కోట్ల మంది వరకు అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తారని అంచనా. టికెట్ల ధరలు బాగా పెరగడంతో ఎయిర్లైన్ కంపెనీల ఆదాయాలు మెరుగయ్యాయి. ఇండస్ట్రీకి 1,500 విమానాలు డెలివరీ కావాల్సి ఉంది. కొత్త విమానాలతో కంపెనీలు అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించనున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ట్రాఫిక్లో (భారతదేశం వెలుపల) భారతీయ క్యారియర్ల వాటా దాదాపు 42 శాతంగా ఉంది. మీడియం టర్మ్లో అంతర్జాతీయ ట్రాఫిక్లో మరింత వాటా పొందడానికి భారతీయ క్యారియర్లకు తగినన్ని అవకాశాలు ఉన్నాయి.