చైనాకు పోటీ ఇవ్వలేకపోతున్న లోకల్‌ కంపెనీలు

చైనాకు పోటీ ఇవ్వలేకపోతున్న లోకల్‌ కంపెనీలు

ధరల మాయాజాలంతో చైనా దెబ్బ కొట్టింది
ఆత్మనిర్భర్‌‌కు ఎగ్జిక్యూషన్‌‌,ఎక్స్‌‌పోర్స్‌ కీలకం

న్యూఢిల్లీ: ప్రొడక్ట్ లను ధరలను తగ్గించి ఇండియన్‌‌ మార్కెట్‌‌ను చైనా కంపెనీలు వశపరుచుకుంటున్నాయని, ఈ ధరలో లోకల్‌ ‌మాన్యుఫ్యాక్చరర్లు ప్రొడక్టులను ఇవ్వలేకపోతున్నారని కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ చైర్మన్‌‌ ఉదయ్‌‌ కోటక్‌ అన్నారు. దీంతో లోకల్‌ ‌కంపెనీలు తమ బిజినెస్‌‌లను క్లోజ్‌ ‌చేసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. లోకల్‌ ‌మాన్యుఫాక్చరర్లను పోటీ నుంచి తప్పించాక, కొంతమంది చైనీస్ సప్లయర్లు తమ ప్రొడక్టుల ధరలను పెంచేస్తున్నారని అన్నారు. ఇండియన్‌ ‌మార్కెట్లో చైనీస్‌ కంపెనీలు ఎంత వరకు పాతుకుపోయాయో తెలియాలంటే చైనా దిగుమతులను లోతుగా పరిశీలించాలని చెప్పారు. ప్రస్తుతం ఇండియా 60 బిలియన్‌‌ డాలర్ల విలువైన వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోందని కోటక్‌ పేర్కొన్నారు. గత దశాబ్దం లేదా రెండు దశాబ్దాలను గమనిస్తే గ్లోబల్‌ మార్కెట్‌‌కు చైనా ఫ్యాక్టరీలా మారిందని చెప్పారు. కేవలం తాను మాన్యుఫాక్చరింగ్‌ ‌హబ్‌‌గా మారడమే కాకుండా వివిధ దేశాలలోనూ అడుగుపెట్టి అక్కడి లోకల్‌ ‌మాన్యుఫాక్చరర్లను తుడిచి పెట్టేసిందని పేర్కొన్నారు. ఇందులో ఇండియా కూడా ఉందని, దీనికి ఇండియా–చైనా ట్రేడ్‌ ‌లెక్కలే రుజువని అన్నారు. గ్లోబల్‌ ట్రేడ్‌ ‌పవర్‌ హౌస్‌‌గా చైనా మారే సమయంలో ఇండియా కొత్తగా ఏమైనా చేసిందా? అని కోటక్‌ ప్రశ్నించారు. దేశ పరిశ్రమలు బతకడానికి కొట్టుమిట్టాడుతుంటే చైనా ఏ విధంగా గ్లోబల్‌ ‌మార్కెట్లో దూసుకుపోయిందో కోటక్ చెప్పారు. ఈ విషయాన్ని వివరించడానికి ధరల మానిపులేషన్‌‌ అంశాన్ని లేవనెత్తారు. ఇండియన్‌ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా చైనా కంపెనీలు ధరల మానిపులేషన్‌‌ను వాడాయని అభిప్రాయపడ్డారు. ఒక వేళ ఇదే నిజమైతే చైనాతో పోటీపడలేకపోవడంలో కేవలం ఇండియన్‌ ‌కంపెనీలను నిందిస్తే సరిపోదని అన్నారు. ఎందుకంటే లోకల్ కంపెనీల దగ్గర సరిపడినంత డబ్బులు ఉండకపోవడమే కారణమన్నారు. రా మెటీరియల్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకోవడం పై కోటక్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రతి సెక్టార్‌‌లో చైనా తన ప్రొడక్ట్ ల ధరలను తగ్గించగలిగిందని, దీంతో ఇండియన్‌ ‌మాన్యుఫాక్చరర్లు తమ బిజినెస్‌‌లను క్లోజ్‌‌ చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

ఆత్మనిర్భర్‌‌కు రెండు‘ఈ’లు..
ధరలను మానిపులేట్‌‌చేయడం వలనే అమెరికా–చైనా మధ్య ట్రేడ్‌‌వార్‌ ‌మొదలయ్యిందని ఉదయ్‌‌ కోటక్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టాలంటే, ఇండియాలో పరిశ్రమలు బలపడాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎగ్జిక్యూషన్ ‌‌(అమలు చేయడం) చాలా కీలకమని అన్నారు. సరైన టైమ్‌‌లో ప్రభుత్వం పాలసీలను తీసుకురావాలని, ఇవి క్రింది స్థాయిలో అమలయ్యేలా చూడాలని చెప్పారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌ముందుకెళ్లాలంటే ఎగ్జిక్యూషన్‌‌ కీలకమన్నారు. ఇండియా తన సొంత కాళ్లపై నిలబడాలంటే రెండు ‘ఈ’ లు ముఖ్యమని, ఒకటి ఎగ్జిక్యూషన్‌ ‌కాగా, మరొకటి ఎక్స్‌పోర్ట్స్‌ అని కోటక్‌ పేర్కొన్నారు. ఎగుమతులను ఏ విధంగా పెంచాలి, పాలసీలను ఎంత తక్కువ టైమ్‌‌లో అమలులోకి తీసుకురావాలనే అంశాలపైనే ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌సక్సెస్‌ ఆధారపడి ఉందని చెప్పారు. ‘ఇండియా తన ఎగుమతులను పెంచుకోవాలి. గ్లోబల్‌‌గా ఇండియా ఎంత కాంపిటీటివో నిరూపించుకోవడానికి ఇవే సాక్ష్యాలుగా నిలుస్తాయని’ అని కోటక్‌ పేర్కొన్నారు.

మోడీ రైట్‌‌ట్రాక్‌‌లో వెళ్తున్నారు..
ఇప్పటివరకు చూస్తే మోడీ ప్రభుత్వం సరైన ట్రాక్‌‌లోనే వెళుతోందని ఉదయ్ కోటక్‌ ‌పేర్కొన్నారు. వచ్చే కొన్నేళ్లలోరూ. 110 లక్షల కోట్లను ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, దీంతో జాబ్‌ క్రియేషన్‌ భారీగా పెరుగుతుందని అన్నారు. అర్జెంట్‌‌గా రెండు విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఉదయ్ కోటక్‌‌అన్నారు. 1) లాక్‌‌డౌన్‌‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రోత్‌‌కోసం కేవలం కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడకూడదని పేర్కొన్నారు. 2) ఇండియాలో సరిపడినంత సప్లయ్‌ చెయిన్‌లేదని, దీంతో డిమాండ్‌ పుంజుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ రెండు అంశాలను ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలన్నారు.

For More News..

లీడర్ షిప్ మార్చండి!

పెద్ద ఖర్చులను రిటర్నులో చెప్పక్కర్లేదు

ఉద్యోగం పోయి.. సొంతూళ్లలో రైతులైనరు