ఇండియన్ హిస్టరీ ..బౌద్ధ సంగీతిలు

ఇండియన్ హిస్టరీ ..బౌద్ధ సంగీతిలు

స్తూపం

బుద్ధుడి అస్థికలపైన నిర్మించిన పవిత్ర కట్టడాన్ని స్తూపం అంటారు. మొత్తం మూడు రకాల స్తూపాలు ఉంటాయి. అవి.. ధాతుగర్భ స్తూపాలు, పారిభోజక స్తూపాలు, ఉద్దేశిక స్తూపాలు. బౌద్ధ సన్యాసుల నివాస గృహాలను విహారం లేదా ఆరామం అని, ప్రార్థనా మందిరాలను చైత్యాలని అంటారు. బౌద్ధులకు పవిత్రమైన ఎనిమిది పుణ్యక్షేత్రాలను అష్టమహాస్థానాలు అంటారు. అవి లుంబిని, గయ, సారనాథ్​, కుషినార, రాజగృహ, శ్రావస్తి, సంకిస్స. 

భారతదేశంలో ఆవిర్భవించిన మతాల్లో బౌద్ధం ముఖ్యమైంది. ఇది అవైదిక, బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా ఏర్పడింది. క్షత్రియ కులానికి చెందిన శాక్య తెగలో గౌతమ బుద్ధుడు జన్మించడంతో ఆయనకు శాక్యముని అని కూడా అంటారు. బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. తండ్రి శుద్ధోదనుడు కపిలవస్తు అనే చిన్న రాజ్యాన్ని పాలించేవాడు. చిన్న వయసులోనే తల్లి మహామాయ మరణించడంతో పినతల్లి గౌతమి ప్రజాపతి పెంచింది.

16 ఏళ్ల వయసులో  యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు రాహులుడు​. బుద్ధుడి జీవితంలో ఐదు ప్రధాన సంఘటనలను పంచ మహా కల్యాణాలు అంటారు. అవి.. జననం​ (గుర్తు తామర పువ్వు), మహాభినిష్క్రమణ (గుర్తు గుర్రం), సంబోధి( గుర్తు రావిచెట్టు), ధర్మచక్ర పరివర్తన(గుర్తు ఎనిమిది ఆకులు కలిగిన ధర్మచక్రం), మహా పరినిర్వణ(గుర్తు స్తూపం).

బుద్ధుని బోధనలు

నాలుగు ఆర్య సత్యాలు 1. ప్రపంచమంత దు:ఖమయం 2. కోరికలే దు:ఖానికి కారణం 3. దు:ఖాన్ని నిరోధించవచ్చు 4. దానికో మార్గం ఉంది. అదే అష్టాంగ మార్గం 

1. సరైన క్రియ 2. సరైన దృష్టి 3. సరైన వాక్కు 4. సరైన లక్ష్యం 5. సరైన మార్గం 6. సరైన జీవనోపాధి 7. సరైన చైతన్యం 8. సరైన ధ్యానం. కారణం, ఫలితం లేకుండా ఏ మానవ చర్య జరగదు అని ప్రత్యుత్తసముప్పద అనే సిద్ధాంతం తెలుపుతుంది. అన్నింటిలోనూ అతిని త్యజించాలని, అన్ని విషయాల్లో మధ్యే మార్గాన్ని పాటించాలని మధ్యమార్గాన్ని గౌతమ బుద్ధుడు బోధించాడు. 

బౌద్ధ మత శాఖలు 

నాలుగో బౌద్ధ సమావేశంలో 18 బౌద్ధ శాఖలు కలిసి హీనయాన, మహాయాన శాఖలుగా అవతరించాయి. హీనయానశాఖలు స్థవిరవాద/ థేరవాద, సాతాంత్రిక, సమ్మతీయ, మహిశాక, మూలస్థవిరవాద, కశ్యపిక. 

మహాయాన శాఖలు మహాసాంఘిక, సర్వస్తవాద, చైత్యక, హైమావతి, సిద్ధార్థిక, లోకోత్తరవాద, పూర్వశైల, ఉత్తరశైల, అపరశైల

హీనయానం: హీనయానులు మార్పును వ్యతిరేకించేవారు. పాళి భాషను కొనసాగించారు. మోక్షం వ్యక్తిగతమని వీరు భావిస్తారు. బుద్ధుడికి సంబంధించిన చిహ్నాలను పూజిస్తారు. విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. 

మహాయానం: పరిస్థితులకు అనుగుణంగా మార్పును స్వాగతించేవారు మహాయానులు. వీరు సంస్కృత భాషను స్వీకరించారు. అందరికీ మోక్షం సిద్ధిస్తుందని భావిస్తారు. బుద్ధుడిని విగ్రహ రూపంలో పూజిస్తారు.  భారతదేశంలో విగ్రహారాధనను ప్రవేశ పెట్టారు. 

వజ్రాయానం: క్రీ.శ. 5వ శతాబ్దంలో గుంటూరు జిల్లాలోని అమరావతిలో వజ్రాయనం ఆవిర్భవించింది. వీరు బోధిసత్వుల భార్యలైన తారలను పూజిస్తారు. భారతదేశంలో నాగార్జునకొండకు చెందిన సిద్ధ నాగార్జునుడు వజ్రయాన మతాన్ని ప్రచారం చేశాడు. ఇందులో కాలచక్రయానం, సహజ యానం అనే శాఖలు ఉన్నాయి. బుద్ధుడి పూర్వజన్మలను బోధిసత్వులు అంటారు. ముఖ్యమైన బోధిసత్వులు వజ్రపాణి, అవలోకిటేశ్వర, మంజుశ్రీ, అమితాబ, మైత్రేయ.

బౌద్ధ పవిత్ర గ్రంథాలు

పాళి భాషలో రాసిన త్రిపీఠికలు బౌద్ధులకు పవిత్ర గ్రంథాలు. సుత్తపీఠిక. ఇందులో ఐదు భాగాలుంటాయి. దిగనికాయ, మజ్జిమనికాయ, అంగుత్తర నికయ, సంయుక్త నికయ, ఖుద్దక నికయ. వినయ పీఠికను బుద్ధుడి శిష్యుడైన ఉపాలి రచించాడు.  ఇందులో బౌద్ధ మతస్తుల ప్రవర్తనా నియమావళి చర్చించబడింది. ఇందులో పతిమొక్క, సుత్త విభాంగ, ఖండక భాగాలు ఉంటాయి. అభిదమ్మ పీటికను మూడో బౌద్ధ సమావేశంలో రాశారు. ఆ సమావేశ అధ్యక్షుడైన మొగలిపుత్తతిస్స రచించాడు. ఇందులో సుత్త, వినయ పీఠికలకు సంబంధించిన తాత్వికమైన చర్చ ఉంటుంది. 

బౌద్ధ సంఘం

ఎలాంటి సామాజిక, లింగ వివక్షత చూపకుండా అందరికీ సన్యాసం స్వీకరించడానికి బౌద్ధ మతం అనుమతి  ఇచ్చింది. బౌద్ధ మతంలో సన్యాసులను భిక్షువు అని, సన్యాసినులను భిక్షుణి అని  పిలుస్తారు. వీరంతా కలసి  సంఘంగా ఏర్పడుతారు. ఆ సంఘానికి అధిపతియైన సంఘథేర సన్యాస దీక్షను ఇస్తాడు. 15 ఏళ్లు నిండని మైనర్లు, బానిసలు, రుణగ్రస్తులు, సైనికులు, అంటువ్యాధులు కలిగిన వారు సంఘంలో ప్రవేశించడానికి అనర్హులు. 

బౌద్ధ పండితులు 
  

హీనయానానికి చెందిన పండితుడు బుద్ధఘోషుడు విసుద్దిమగ్గ (త్రిపీటకాలపైన వ్యాఖ్యానం), దాతుకథ ప్రకరణ, కథావత్తు ప్రకరణ, సామంత పసాదిక
( వినయ పీఠికపైన వ్యాఖ్యానం)

    మహాయనానికి చెందిన పండితుడు ఆచార్య నాగార్జునుడు. అతని రచనలు.. మాధ్యమికవాదం, శూన్యవాదం అనే నూతన తత్వాలను బోధించాడు. మాధ్యమికకారిక, శూన్య సప్తతి, ప్రజ్ఞాపారమితి, సుహృల్లేఖ, రసరత్నాకర, ఆరోగ్యమంజరి.

    భావవివేకుడు తర్కజ్వాల, ప్రజ్ఞప్రదీప, కరతలరత్న అనే గ్రంథాలను సంస్కృతంలో రచించాడు.
    బుద్ధ పాలితుడు ప్రసాంగిక మాధ్యమిక వాదం అనే కొత్త తత్వాన్ని బోధించాడు. సంస్కృతంలో మాధ్యమికవృత్తి అనే గ్రంథాన్ని రచించాడు. 

    మైత్రేయనాథుడు మహాయాన మతంలో యోగకార/ విజ్ఞానవాద అనే తత్వాన్ని బోధించాడు. లంకావతారసూత్ర అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. 

    దిగ్నాగుడు ప్రమాణ సముచ్ఛయ, న్యాయ ప్రవేశ, ఆలంబన పరీక్ష, హేతుచక్రధమరు మొదలైన గ్రంథాలను సంస్కృతంలో రాశాడు.