విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి దూకుడు..ఫ్లోటింగ్ సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుపై రాష్ట్ర సర్కార్ నజర్ 

విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి దూకుడు..ఫ్లోటింగ్ సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుపై రాష్ట్ర సర్కార్ నజర్ 
  • కొత్త ప్రాజెక్టుల ద్వారా 7 వేల మెగావాట్ల పవర్​ జనరేషన్ టార్గెట్  
  • త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం 
  • భట్టి విక్రమార్క ఆదేశాలు
  • డీపీఆర్​ల తయారీ, వివిధ శాఖల పర్మిషన్లకు పలు సూచనలు 
  • ప్రాజెక్ట్​ల పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్​బోర్డు ఏర్పాటుకు నిర్ణయం

కోల్​బెల్ట్​,వెలుగు: విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ ల్లో సింగరేణి స్పీడ్​పెంచింది. రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్, సోలార్​పవర్​ఉత్పత్తి చేసే తొలి ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇదే.  ప్రస్తుతం పవర్ జనరేషన్​విస్తరణ దిశగా ముందుకెళ్తోంది. వాటర్​ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్, విండ్ పవర్, పంప్డ్​స్టోరేజీ పవర్​ ప్లాంట్​ వంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు డీపీఆర్ పూర్తి చేసి రాష్ట్ర సర్కార్​పర్మిషన్ల కోసం చూస్తోంది. తాజాగా శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణి పవర్​ప్లాంట్లపై జరిగిన రివ్యూ మీటింగ్​లో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు మరింత స్పీడప్​చేయాలని ఆదేశించారు.

వివిధ శాఖల నుంచి రావాల్సిన పర్మిషన్లకు లేఖలు రాయాలని సంస్థ అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లు, రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లలో వాటర్ ఫ్లోటింగ్​సోలార్​ప్లాంట్లు, 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్ల డీపీఆర్​ను వచ్చే నెలాఖరుకు పూర్తి చేయాలని స్పష్టంచేశారు. వీటిపై వచ్చే కేబినేట్​మీటింగ్ లో చర్చించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయించారు. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్,బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ వంటి పనులపైనా రివ్యూలో చర్చించారు. ఆయా ప్రాజెక్టుల ద్వారా సుమారు 7 వేల మెగావా ట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని సంస్థ భావిస్తుండగా, వీటికి రాష్ట్ర సర్కార్ వివిధ శాఖల నుంచి పర్మిషన్లు ఇప్పించాలని డిప్యూటీ సీఎంను సింగరేణి సీఎండీ బలరాంనాయక్​కోరారు. 

మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని ద్వారా పంప్డ్​ స్టోరేజ్ పవర్​ 

పెద్దపల్లి జిల్లా రామగుండం--–1 ఏరియాలో మూసేసిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వాటర్ సంపు ద్వారా 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీని డీపీఆర్ తయారీ బాధ్యతని ఇప్పటికే వ్యాప్కోస్ కంపెనీకి అప్పగించింది.  ఇటీవల మేడిపల్లి ఓసీపీని డిప్యూటీ సీఎం సందర్శించి పరిశీలించారు.  రివ్యూ మీటింగ్ లోనూ ప్లాంట్​పనులు త్వరగా షురూ చేయాలని ఆదేశించారు.  ఓపెన్​కాస్ట్ ప్రాజెక్టుల వద్ద బొగ్గు ఉత్పత్తి కోసం తవ్వి తీసిన మట్టి గుట్టలపైన విండ్ పవర్ ఉత్పత్తి ఏర్పాట్లపై సింగరేణి దృష్టి పెట్టింది. ఐదు జిల్లాల్లో 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్ల డీపీఆర్​లను ఈనెలలోపు సిద్ధం చేయనుంది.  

జైపూర్​లో మూడో ప్లాంట్​ నిర్మాణానికి రెడీ 

జైపూర్​ప్లాంట్ విస్తరణలో భాగంగా 800 మెగావాట్ల సూపర్​క్రిటికల్​మూడో యూనిట్​ను రూ.6,700కోట్లతో నిర్మించనుంది. ఇప్పటికే దీని పనులను భారత్​హెవీ ఎలక్ర్టికల్స్​లిమిటెడ్​(భెల్) దక్కించుకుంది.127 హెక్టార్ల స్థలంలో 50 నెలల్లో  నిర్మించేందుకు సింగరేణి ప్లాన్​చేసింది. రాష్ట్ర కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి నేతృత్వంలో సీఎం రేవంత్​రెడ్డి ప్లాంట్ నిర్మాణ పనులకు త్వరలో భూమిపూజ చేస్తారు.  

ఇతర రాష్ట్రాల్లోనూ ప్లాంట్ల ఏర్పాటుపై.. 

మంచిర్యాల జిల్లా జైపూర్​లో 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్ తో పాటు కోల్ బెల్డ్ వ్యాప్తంగా సోలార్​ప్లాంట్ల ద్వారా 234  మెగావాట్లు, మరో 10 మెగావాట్లు వాటర్​ఫ్లోటింగ్​సోలార్​పవర్​ను తయారు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్​పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టింది. మార్కెట్​లో పోటీని తట్టుకోవడానికి  తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏడాదికి రూ.700 కోట్ల విద్యుత్​బిల్లులను చెల్లిస్తుండగా.. దీన్ని పూర్తిగా తగ్గించుకోవాలనే ఆలోచనతో ఉంది. ఇందుకు రాజస్థాన్​లో1500 మెగావాట్ల సోలార్​ప్లాంట్​ప్లాన్ రెడీ చేసింది.

ఒప్పందం మేరకు ఆ రాష్ట్రంలోని సోలార్ వ్యాలీలో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. మరోవైపు అక్కడి ఖాళీ స్థలాల్లో ఇంకో 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు నిర్మించనుంది. ఆయా ప్రాజెక్ట్ లను మరింత  స్పీడ్​గా కంప్లీట్ చేసేందుకు   చర్యలు తీసుకోవాలని, దీనిపై త్వరలోనే కేబినేట్ లో చర్చించేందుకు డిప్యూటీ సీఎం నిర్ణయించారు. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్​నుంచి ఉత్పత్తి ప్రారంభమైనందున అక్కడ కూడా సోలార్​ పవర్​ ప్లాంట్ ​ఏర్పాటు, స్థల సేకరణపైనా చర్చించారు. 

వాటర్​ ఫ్లోటింగ్ సోలార్​ ప్లాంట్ల పర్మిషన్లకు చర్యలు

జైపూర్​జలాశయంలో 10 మెగావాట్ల వాటర్​ఫ్లోటింగ్​సోలార్​ప్లాంట్(నీటిపై తేలియాడే సోలార్​పలకలు)ను విజయవంతంగా నడుపుతోంది. దీంతో రాష్ట్రంలోని ఇతర రిజర్వారయర్లలోనూ 800 మెగావాట్ల ఉత్పత్తికి రెడీ అయింది. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ లో నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు కాగా, 18వేల ఎకరాల విస్తీర్ణంలో 800 ఎకరాల్లో రెండు దశల్లో 500 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు 2022లోనే సర్వే చేసి సర్కార్ కు రిపోర్ట్ అందజేసింది. లోయర్ మానేరు(ఎల్​ఎండీ)లోనూ 300 మెగావాట్ల ప్లాంట్​కు కూడా డీపీఆర్​పంపించింది. రెండు ప్లాంట్లపై ఇరిగేషన్ శాఖ పర్మిషన్లకు లేఖలు రాయాలని,  ఎప్పటికప్పుడు సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరపాలని అధికారులు నిర్ణయించారు.